హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఎంబీసీల (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్) అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. బుడబుక్కల కులసంఘం రాష్ట్ర మహాసభ సికింద్రాబాద్ జనరల్ బజార్లోని గీతాభవన్లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఎంబీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని, అందుకు కులసంఘాల ప్రతినిధులు చొరవ చూపాలని, కులబాంధవులను ఆ దిశగా చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో సరైన గుర్తింపు వస్తుందని, పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చేయాలని సూచించారు. అనంతరం కులసంఘం ప్రతినిధులు పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేయగా, వాటిపై సానుకూలంగా స్పందించారు. బుడబుక్కల కుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని చైర్మన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్, 33 జిల్లాలకు చెందిన అధ్యక్షప్రధాన కార్యదర్శులతో పాటు, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీను, కోశాధికారి సుధాకర్, ముఖ్య సలహాదారు సున్నపు రాములు, సీహెచ్ వెంకటేశ్వర్రావు, విఠల్రావు తదితరులు పాల్గొన్నారు.