Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఇసుక ధర డబుల్ అయ్యింది. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. గడిచిన నెల రోజులుగా పెరుగుతూ.. పెరుగుతూ ఇప్పుడు డబుల్ను మించింది. కొన్ని చోట్ల డబుల్ ఉంటే.. మరికొన్న చోట్ల డబుల్ను మించి పోతున్నది. ఊహించని ఈ హటాత్పారిణామానికి నిర్మాణదారులు ఖిన్నులవుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ఇసుక ధరలు ఆల్టైం హైగా ఉన్నాయని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. గడిచిన పదేండ్లలో ఈ ధర ఎన్నడూ లేదని వ్యాపారులు, లారీల యజమానులు చెప్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలోని ప్రధాన ఇసుక క్వారీలన్నీ మూసివేశారని లారీల యజమానులు చెప్తున్నారు. ఇక ఇసుకను ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశించి రూపొందించిన ఆన్లైన్ ఇసుక బుకింగ్కు సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వడం లేదని పేర్కొంటున్నారు.
రోజంతా కూర్చున్నప్పటికీ ఇసుక దొరకటం లేదని, తప్పని పరిస్థితుల్లో అడ్డాల మీదకు వెళ్లి లారీల్లోని ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, లారీల యజమానులు చెప్పిందే ధర అవుతున్నదని వాపోతున్నారు. గతంలో ఎన్నూడూలేనంతగా ఇప్పుడు ఇసుక కొరత ఏర్పడింది. నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కసారిగా ధరలు పెరగటంతో సామాన్యులు నివ్వెరపోతున్నారు. ఇంటి నిర్మాణం మొదలుపెట్టుకున్నవాళ్లు ఇసుక ధర అమాంతం పెరగటంతో అంచనాలన్నీ తలకిందులయ్యాయని బాధపడుతున్నారు. ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయటం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి ఇది ఇండ్ల నిర్మాణానికి అనుకూలమైన సమయం. ఇప్పుడు స్లాబ్లు, గోడలు వంటివాటిని పెట్టుకునేవారు ఇప్పుడే వేగం పెంచుతారు. వేసవి వచ్చేనాటికి ఒక రూపానికి వచ్చి, వర్షాకాలం నాటికి పనులన్నీ పూర్తవుతాయని భావిస్తుంటారు. కానీ పరిస్థితులు తలకిందులు అవటం సామాన్యుల వంతు అవుతున్నది.
రాష్ట్రంలోని క్వారీల మూత!
రాష్ట్రంలో సుమారు 40 పెద్ద క్వారీలున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు సుమారు 60 వేల నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికి తీస్తుంటారు. మంచి డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఏనాడూ హైదరాబాద్ మార్కెట్లో టన్ను ఇసుకకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 మించలేదు. ఇసుక కావాల్సినంత అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతిరోజు రాష్ట్రంలోని క్వారీల నుంచి 20 వేల క్యూబిక్ మీటర్లకు మించి రావటం లేదు. దీంతో లారీల యజమానులు ధరలను పెంచుతున్నారు. ఒకవైపు ఇసుక లభ్యత తగ్గడం, మరోవైపు ఇండ్ల నిర్మాణం జరుగుతుండటం, డిమాండ్ పెరగటంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. తెలంగాణలో ఉన్న క్వారీలను ఉద్దేశపూర్వకంగానే మూయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమైన క్వారీలున్నచోట స్థానిక ఎమ్మెల్యేలు, అక్కడి అధికారులతో ఒత్తిడి చేయించి తాత్కాలికంగా మూయిస్తున్నారు. క్వారీల నిర్వాహకులు తమను వచ్చి కలవాలని హుకుం జారీ చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు.. క్వారీల వద్ద తమవారిని పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. వీటన్నింటిని హైదరాబాద్లోని ఒకరిద్దరు మానిటర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వారు చెప్పినట్టే ఇప్పుడు క్వారీలు మూయించేశారు.
ఆంధ్ర ఇసుకకు గేట్లు తెరిచారు!
తెలంగాణలో క్వారీలు మూయించి ఏపీ నుంచి వచ్చే ఇసుకకు మాత్రం గేట్లు ఓపెన్ చేశారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇసుకను తీసుకురావడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కానీ, ఇప్పుడు మన రాష్ట్రంలో ఇసుక ధరలను అదుపు చేసేందుకు అనిచెప్పి బయటి రాష్ట్రాల ఇసుకను ప్రోత్సహిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక యంత్రాంగమే పనిచేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుకను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఆ రాష్ట్రం జీవో నంబర్ 71 జారీచేసింది. జీవోలోని రూల్ నంబర్ 15లో ఇదే విషయం స్పష్టంగా ఉన్నది. దీని ప్రకారం ఇతర రాష్ట్రాలు, సరిహద్దులకు అవతల ఉన్న ప్రాంతాలకు ఇసుక అమ్మడం నేరం. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు ఈ నెల 3న ఒక మెమోను జారీచేసింది (మెమో నంబర్ 87/p(sand)/2014). ఈ మెమోను గనులశాఖ డైరెక్టర్ బీఆర్వీ సుశీల్ కుమార్ జారీ చేశారు.
దీనిలో ఏం పేర్కొన్నారంటే.. ‘మన రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నది. దీన్ని అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుకపై రూ.200 రెగ్యులేటింగ్ చార్జీల కింద వసూలు చేసి ఇసుకను అనుమతించాలి’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతంలో ఒక జీవో ఉన్నదంటూ పాత జీవోను ఊటంకిస్తూ మెమో జారీచేశారు. వాస్తవానికి మన రాష్ట్రంలోని క్వారీల నుంచి ఇసుకను లారీ యజమానులు తోడుకెళ్తే ఒక టన్నుకు రూ.650 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి క్వారీల నుంచి వచ్చే టన్నుకు రూ.650 వదులుకొని బయటి రాష్ట్రాల నుంచి వచ్చే లారీల్లోని ఇసుకను రెగ్యులేట్ చేసి టన్నుకు రూ.200 చొప్పున వసూలు చేయాలని చెప్పటం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరగటంతోపాటు వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది, ఆర్థిక భారం కూడా. ప్రస్తుతం మన ఇసుకను తెచ్చి సరఫరా చేయించాల్సిన అధికారులు బయట అక్రమ ఇసుకను రెగ్యులేట్ చేయించే పనిలో పడ్డారు.
ఎవరికి లాభం?
ఇసుకను అక్రమంగా రాష్ట్రంలో అనుమతించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఊరికే తీసుకొచ్చేంత ధైర్యం లారీల యజమానులు చేయరు. దీనివెనుక పెద్ద ముఠా పనిచేస్తున్నదని పలువురు చెప్తున్నారు. ఇన్స్టంట్గా డబ్బులు వచ్చే మార్గాల్లో ఇసుక అమ్మకాలు ఒకటని అంటున్నారు. రాష్ట్రంలోని ఒక ముఠా ఇటీవల అరంగేట్రం చేసి ఇసుక అమ్మకాలను పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నట్టు తెలిసింది. ప్రతిరోజు వందల లారీలు హైదరాబాద్కు వస్తున్నాయి. రూ.కోట్లలో అమ్మకాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రైవేటు ఖజానాకే చేరుతున్నాయి. దీనివల్ల లబ్ధి పొందుతున్నవారికి ప్రభుత్వంలో, గనుల శాఖలోని పెద్ద తలకాయలు సహకరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.