మెదక్, జూన్ 24 (నమస్తే తెలంగాణ), నర్సాపూర్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జా చేసిన తమ భూములను వెంటనే ఇప్పించాలని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో సుమారు 150 మంది రైతులు మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల శివారులోని భూముల్లో 27 ఏండ్లుగా సాగు చేసుకొంటున్నామని, అయితే ఏడాది కిందట ఈటలకు చెందిన జమున హేచరీస్ కంపెనీ ఆ భూములను ఆక్రమించి చుట్టూ ప్రహరీని నిర్మించిందని ఆరోపించారు.
ఇప్పటికే ఈ భూముల్లో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, అధికారులు ఆరు నెలల కిందట సర్వే చేశారని, ఇప్పటికీ భూముల పొజెషన్ చూపలేదని వాపోయారు. ఇప్పటికైనా ఆ భూములను తమకు అప్పగించాలని, లేదంటే ఆయా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో 130 సర్వే నంబర్లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురికి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు.
ఈ భూమిని రజక కులానికి చెందిన చాకలి భిక్షపతి, చాకలి లింగయ్య, చాకలి యాదయ్య, చాకలి నాగులు, చాకలి బుచ్చమ్మ, చాకలి కళమ్మ, చాకలి శ్రీనివాస్, చాకలి రాజమణికి ఎకరం 20 గుంటల చొప్పున ఇస్తూ పట్టా సర్టిఫికెట్ను గతంలో జారీ చేసింది. కాగా, ఆ భూములను జమున హేచరీస్ కబ్జా చేసిందని, దీనిపై గత ఏడాది మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్కు వినతి పత్రాలు సమర్పించామని బాధితులు తెలిపారు. భూములపై గత డిసెంబర్లో సర్వే చేశారని, కానీ ఇప్పటికీ తమకు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రత్యేక చొరవ తీసుకొని భూములను ఇప్పించాలని విన్నవించారు. దీంతో కలెక్టర్ హరీశ్ బాధిత రైతులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పటికే 337 మందికి పట్టాలు ఇచ్చామని, మరో 87 మందికి ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. కోర్టులో 3 రిట్ పిటిషన్లు ఉండటంతో ఆలస్యమవుతున్నదని వెల్లడించారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
జమున హేచరీస్ పేరిట ఈటల రాజేందర్ కబ్జా చేసిన పేద రైతుల భూములను త్వరలోనే వారికి అందజేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల రైతులు శుక్రవారం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. ఆక్రమిత భూమిని సర్వే చేస్తే 55 ఎకరాల భూమి రైతులదని తేలినట్టు చెప్పారు.
ఈ విషయంపై మంత్రి హరీశ్రావుతో మాట్లాడామని, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. భూములు కోల్పోయిన రైతులకు వారంలోగా పట్టాలు అందజేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
ఆ భూములకు దారులు లేవని, ఇప్పడు అవి కూడా వేయిస్తామని అన్నారు. భూములకు హద్దులు కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. బాధిత రైతులకు రైతుబంధు, రైతుబీమా వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, వెల్దుర్తి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకట్, నగేశ్, మాసాయిపేట, వెల్దుర్తి మండల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.