TS Minister KTR | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదని, అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మన పరిశ్రమలు పోటీపడేలా తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమని ఆయన చెప్పారు. ఉన్నతంగా ఆలోచించాలని, ఉన్నతమైన కలలు కనాలని, వాటిని సాకారం చేసేందుకు కృషిచేయాలని సూచించారు. జపాన్ వంటి దేశాలతో మనం స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ, పారిశ్రామికరంగం అభివృద్ధికి ప్రభుత్వ విధానాలు ఎంతో ముఖ్యమైవని, సహజంగా ఒక ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలను తదుపరి వచ్చే ప్రభుత్వాలు కొనసాగిస్తాయన్నారు. చంద్రబాబు నాయుడు వాణిజ్యం, ఐటీ రంగాలకు ప్రాధాన్యతనిస్తే, తదుపరి వచ్చిన వైఎస్ఆర్ వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ మాత్రం అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామికరంగం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల తేడా లేకుండా సమ్మిళిత అభివృద్ధికి కృషిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ కేవలం 5.05 లక్షల కోట్లు కాగా, నేడు 13.27లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అలాగే తలసరి ఆదాయం రూ. 1.12లక్షల నుంచి 3.70లక్షలకు పెరిగిందని, దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఇది అత్యంత ఎక్కువని చెప్పారు.
జీవశాస్త్రాల రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఉత్పత్తవుతున్న ఔషధాల్లో 40శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు తెలంగాణలో తయారవుతున్నాయన్నారు. వచ్చే ఏడాదికి ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మన రాష్ట్రంలోనే తయారవుతాయని ధీమా వ్యక్తంచేశారు. యుఎస్ఎఫ్డీఏ అనుమతించిన ఔషధాల్లో తెలంగాణ కంపెనీలే అత్యధికంగా ఉన్నాయన్నారు. యుఎస్ ఎఫ్డీఐ తెలంగాణకు చెందిన 214ఔషధాలకు ఆమోదం తెలపగా, 189 ఔషధాలతో న్యూజెర్సీ రెండో స్థానంలో ఉందన్నారు.
వైద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ను సుల్తాన్పూర్లో ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందులో 60కంపెనీలు కొలువు దీరాయని, వాటిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ కంపెనీ ఉందన్నారు. అంతేకాదు, ముచ్చర్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మ క్లస్టర్ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
తయారీరంగంలో యుఎస్, చైనా వంటి దేశాలుసహా ప్రపంచంతో పోటీపడాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండేండ్ల క్రితం జరిగిన బయో ఏషియా సదస్సులో నాటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్తో పారిశ్రామికవేత్తలు సమావేశమైన సందర్భంగా ఓ పారిశ్రామికవేత్త మాట్లాడుతూ, మన దేశంలో తయారు చేయడంకన్నా గ్లౌజ్లు, మాస్క్లు వంటివి చైనా నుంచి దిగుమతి చేసుకోవడం ఎంతో చౌకగా ఉంటుందని చెప్పారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారితో ఎలా పోటీపడగలమన్నారు. దేశంలో 78శాతం మెడికల్ డివైజెస్లు, 80శాతం వంట నూనెలుసహా అనేకం దిగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ఇవే కాక ఔషధ రంగంలో సైతం ఏపీఐల దిగుమతికి చైనాపైనే ఆధారపడాల్సి వస్తున్నదన్నారు.
ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు 2015లో సీఎం కేసీఆర్ చైనా వెళ్లారని, అక్కడి షీచో అనే ప్రాంతంలో 70,000ఎకరాల్లో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ను గమనించాక చైనా తరహాలోనే భారీస్థాయిలో పారిశ్రామికీకరణ చేయాలని నిర్ణయించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకన్నా మనం మెరుగ్గా ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ భారీస్థాయిలో దిగుమతులు చూసినప్పుడు ఒక భారతీయుడిగా మంచిగా అనిపించదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మాత్రమే ఆదర్శంగా ఉంటే సరిపోదని, ప్రపంచస్థాయిలో పోటీపడేలా ఉండాలన్నారు. ఎఫ్టీసీసీఐ ఈ దిశగా పెద్దగా ఆలోచించాలని సూచించారు. హైదరాబాద్లోని ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ నేడు బోయింగ్తో కలిసి పనిచేస్తున్నదని, అంతరిక్షంలోకి రాకెట్ను పంపిన స్పేస్టెక్ కంపెనీ స్కైరూట్ టీహబ్ నుంచి వచ్చిందని, అలాగే, ధృవ కంపెనీ నానో శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపిందని, ఇటువంటి కంపెనీలను చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందన్నారు.
మనం వాడుతున్న ఫోన్లు, గడియారాలు, కార్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు, ఇంట్లో వాడే వస్తువులన్నీ విదేశీ కంపెనీలవేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటిల్లో 70-80శాతం వస్తువులు దిగుమతి అయినవేనన్నారు. థాయ్లాండ్, వియత్నాంలో విదేశీ వస్తువుల వినియోగం చాలా తక్కువగా ఉంటుందన్నారు. జపాన్లో చిన్నచిన్న పిల్లలకు కార్ల తయారీపై శిక్షణనిస్తున్నారని చెప్పారు. చిన్నతనం నుంచే ఆటలద్వారా వారికి వస్తువుల తయారీపై మక్కువ పెంచడం ద్వారా వారిని తయారీ రంగంవైపు మళ్లిస్తున్నారన్నారు.
ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన జపాన్, కేవలం 12కోట్ల జనాభా, 90శాతం భూభాగం నివాసయోగ్యంగా లేకున్నా అసాధారణ ప్రగతి సాధించిందని, నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థను కలిగివున్నదన్నారు. ప్రకృతి వనరులు లేకున్నప్పటికీ కేవలం తమ జ్ఞానం ద్వారా వారు 40ఏళ్లలో ఇంతటి ప్రగతి సాధించారన్నారు. ఇతర రాష్ర్టాలతో పోటీ కాకుండా పెద్దగా ఆలోచించాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు.
ఎఫ్టీసీసీఐ యువ బృందాన్ని ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు పంపి అధ్యయనం చేయాలని, ఐడియా ఉంటే పెట్టుబడి దానంతట అదే వస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని, 2009-10లో లండన్లో ఏర్పాటైన గ్రీన్గో కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ ఉదహరించారు. 30ఏళ్ల క్రితం లైసెన్స్రాజ్లో పరిశ్రమలు పెట్టేందుకు అనుమతుల కోసం ఎన్నో పైరవీలు చేయాల్సివచ్చేదని, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.ఇప్పుడు ప్రభుత్వాలు, అధికారులు అందుబాటులో ఉంటున్నారన్నారు.
తెలంగాణ ఏర్పాటైన మొదట్లో అధికారులతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పరిశ్రమల ఏర్పాటునకు అనుమతి ఎందుకు పొందాలని ప్రశ్నించారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అనుమతులకోసం ఎందుకు ఇంత సమయం పడుతుందని ప్రశ్నించారని చెప్పారు. జవాబుదారీతనం కోసం అనుమతి పొందాల్సి ఉంటుందని అధికారులు తెలపగా, రైట్ టూ ఎడ్యుకేషన్ మాదిరిగా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టాలని కేసీఆర్ సూచించారన్నారు. నాటినుంచి టీఎస్ ఐ-పాస్ విధానం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దేశంలో ఇటువంటి విధానం ఎక్కడా లేదన్నారు.
జాతీయ పంచాయితీ అవార్డుల్లో తెలంగాణ 30శాతం అవార్డులను సొంతం చేసుకున్నదని, దేశ జనాభాలో 2.5 శాతం మాత్రమే ఉన్నా దేశ జీడీపీలో ఐదుశాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ ఎగుమతులు 2014లో రూ. 56వేల కోట్లు కాగా, నేడు 2.41లక్షల కోట్లకు పెరిగాయని, 2014లో 68లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, నేడు మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నానమన్నారు. పారిశ్రామికరంగం కూడా ఎంతో ప్రగతి సాధించిందని, 47బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. ఇందులో 24శాతం రిపీట్ ఇన్వెస్ట్మెంట్లని తెలిపారు.
పారిశ్రామిక రంగం ద్వారా ఉద్యోగావకాశాలు లభించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 7.7శాతం గ్రీన్ కవర్ను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి,సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికరంగం తదితర అన్ని రంగాలూ సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ తెలంగాణ అని కేటీఆర్ వివరించారు.
ఎఫ్టీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో వరుసగా మూడుసార్లు పాల్గొని హ్యాట్రిక్ సాధించినట్లు, త్వరలో తెలంగాణ రాష్ట్రానికి మూడవ దఫా జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి హ్యాట్రిక్ సాధించి పెట్టాలని మంత్రి కేటీఆర్ పారిశ్రామికవేత్తలను కోరారు. మరోసారి తాను ఎఫ్టీసీసీఐకి వచ్చేలా చూడాలని కేటీఆర్ కోరారు. కార్యక్రమం అనంతరం ఎంపికచేసిన 22కంపెనీలకు ఎక్స్లెన్స్ అవార్డులను మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు అనిల్ అగర్వాల్, గ్రీన్కో గ్రూపు ఎండీ అనిల్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.