చింతపల్లి: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్రెడ్డి.. ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
రైతు బంధు, రైతు భీమా పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని సుఖేందర్ రెడ్డి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి, రైతులకు సమృద్ధిగా సాగునీటిని, 24 గంటల కరెంటును అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆకే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతూ రాష్ట్రంలో ధాన్యం కొలుగోలు చేయడం లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోందని సుఖేందర్ రెడ్డి చెప్పారు. దేశంలోని రైతులందరూ కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.