నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు.. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో 50 ఏండ్లలో జరిగిన అభివృద్ధికి నాలుగు రెట్లు అధికంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎనిమిదేండ్లలో చేసి చూపించామని చెప్పారు. ఇది తప్పని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సవాల్ చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధి మహారాష్ట్రవాసులకు కనిపిస్తున్నది.. కానీ ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపిస్తలేదని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఖమ్మ సత్తా చూపుదామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. అనంతరం కార్యకర్తలకు అందించిన విందు భోజనంలో మంత్రి పాల్గొని స్వయంగా వడ్డించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెం పంచాయతీలో ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ.. మనస్సున్న మహారాజు సీఎం కేసీఆర్ అన్నారు. తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున కార్యకర్తలు సన్నద్ధం కావాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకల అమలుపై గ్రామాల్లో చర్చ జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లిలో సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి వినోద్ హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తుచేశారు. మహబూబ్నగర్లో రజక యువజన క్రాంతి సంఘం, దేవాంగ కుల సంఘం, ఎరుకల సంఘం ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి బీ టీమ్గా పని చేస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ వారసుడి ఇంటిని అక్రమంగా ఖాళీ చేయిస్తే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సోయి లేకపోగా బీజేపీతో అంటకాగి తిరుగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రోల్ మాడల్ అని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తెలంగాణ వెనుకబాటుకు గురైందని, రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విజన్తో అభివృద్ధిలో దూసుకుపోతుందని గుర్తుచేశారు.
నాడు పుష్కరాల సమయంలోనే కృష్ణా జలాలను చూసిన తెలంగాణ ప్రజలు.. నేడు నిత్యం నాగర్కర్నూల్ ప్రాంతంలోని పొలా ల్లో పారుతున్న నదీ జలాలతో ప్రజల కాళ్లు తడుస్తున్నాయని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని చిన్నముద్దునూరులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఎంపీ రాము లు మాట్లాడుతూ.. కందనూలు ప్రాంతాన్ని పాడి పంటలతో సస్యశ్యామలంగా మార్చిన ఘనత ఎమ్మెల్యే జనార్దన్రెడ్డిదే అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరుతుండటంతో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.