Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు.
విద్యార్థులు తమ మార్కు మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తర్వాత పొందవచ్చని చెప్పారు. ఈ రివాల్యుయేషన్ కు ఒక్కో పేపర్కు రూ.700 చొప్పున చెల్లించి ఈ నెల 30వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష జవాబు పత్రాల నకలు పొందగోరేందుకు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 26వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.