తగిలి శ్యామలను సత్కరించిన ఉస్మానియావర్సిటీ తెలుగు శాఖ
బంజారాహిల్స్,జూలై 1: నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన తగిలి శ్యామల ఓయూ నుంచి పీహెచ్డీ అందుకొన్నారు. పాలమూరు గ్రామీణ మహిళలు ఇష్టంగా పాడుకొనే బొడ్డెమ్మ పాటల ప్రాముఖ్యం, విశిష్ఠతపై ఆమె పరిశోధన చేశారు. పరిశోధనలో భాగంగా ఆమె రూపొందించిన ‘మహబూబ్నగర్ జిల్లా బొడ్డెమ్మపాటలు- జనజీవన చిత్రణ’కు ఓయూ ఓరియెంటల్ విభాగం తెలుగుశాఖ ఆమెకు డాక్టరేట్ అందజేసింది.
సుమారు 100కు పైగా బొడ్డెమ్మ పాటలను శ్యామల సేకరించారు. ఆ పాటల భావాలకు అక్షరరూపం కల్పించారు. మరుగునపడిపోతున్న బొడ్డెమ్మ పాటలను భవిష్యత్తు తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పరిశోధనను చేపట్టానని శ్యామల తెలిపారు.