హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘నేను డిగ్రీ బీఎస్సీ పూర్తి చేశాను. సివిల్స్ రాయాలనుకొంటున్నా. ఇందుకు ఎంఏ చేయాలని ఉన్నా అవకాశం లేకుండా పోయింది. నాలుగేండ్ల బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కాకుం డా ఎమ్మెస్సీ చదవాలని ఉన్నది.’ ఇవి తరచూ వినిపిస్తున్న మాటలు. ఇప్పటివరకు డిగ్రీ ఏ కోర్సులో చదివామో పీజీ కూడా అదే కోర్సులో పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా డిగ్రీ ఏదైనా పీజీలో ఇష్టమైన కోర్సు అభ్యసించే అవకాశం రాబోతున్నది. ఇందుకు ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ కసరత్తు చేస్తున్నది. దీని పరిణామాలు, ఉపాధి, ఉద్యోగావకాశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నది. స్పష్టత రాగానే ఉన్నత విద్యామండలికి నివేదించి వచ్చేవిద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.
ఆరు కోర్సుల్లో అమలు
ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో ఏ కోర్సు పూర్తిచేసినా పీజీలో 6 కోర్సులు..ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్లో చేరేందుకు అవకాశమిచ్చారు. తాజాగా చేపట్టిన సీపీగెట్ ప్రవేశాల్లో రాష్ట్రంలోని 7 వర్సిటీల్లోని పీజీ కాలేజీల్లో ఈ 6ఎంఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బీటెక్, బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులు చదివినవారంతా ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. ఈ విధానం సత్ఫలితాలిస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎనీ డిగ్రీ టు ఎనీ పీజీలో చేరేందుకు అవకాశం కల్పించనున్నారు. అయితే ఏటా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే సీపీగెట్లో ర్యాంకు వస్తేనే ఈ అవకాశం లభిస్తుంది.
ఉదాహరణలిలా..