హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17, సుల్తాన్బజార్ : హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖాన వైద్యులు నలుగురు చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలను ఉచితంగా చేసి, ప్రాణదానం చేశారు. ఇద్దరు బాలలకు అరుదైన శస్త్ర చికిత్సలతోపాటు మరో ఇద్దరు చిన్నారులకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేశారు. శస్త్రచికిత్సల వివరాలను ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ సోమవారం మీడియాకు వివరించారు. ఖమ్మం జిల్లా ధన్వారిపాలెంకు చెందిన అన్నదమ్ములు సిద్ధార్ద్(16), విజయ్(14) పి-ఫిక్ (ప్రోగ్రెసివ్ ఫ్యామిలీల్ ఇంట్రా హెపాటిక్ కొలెస్టాసిస్) అనే అరుదైన జన్యు సంబంధ కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. కామెర్లు, దురద, ఎదుగుదలలో లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. తొలుత ప్రైవేట్ దవాఖానల్లో పిల్లలను చూపించగా, కాలేయ మార్పిడి చేయాల్సి ఉంటుందని, లక్షల్లో ఖర్చ అవుతుందని చెప్పారు. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు ఉస్మానియా దవాఖాన వైద్యులను ఆశ్రయించారు. ఉస్మానియా వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించగా అన్నదమ్ములిద్దకీ సిర్రోసిస్ లేదని తేలింది. కాలేయం పూర్తిగా దెబ్బతినలేదని గుర్తించారు. వీరికి ‘ఇలియల్ ఎక్స్క్లూషన్’ అనే కొత్తరకం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. కాలేయ మార్పిడితో అవసరం లేకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పి ఫిక్ వ్యాధి వంశపారంపర్యంగా, చాలా అరుదుగా వస్తుందని, ఇది చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు వివరించారు. క్రమంగా కాలేయం పూర్తిగా దెబ్బతినడం వల్ల రోగి మృతి చెందే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధి సోకినవారికి గతంలో కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు కాలేయం పూర్తిగా దెబ్బతిననివారికి ఇలియల్ ఎక్స్క్లూషన్ అనే ఆధునిక శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. మూడేండ్ల క్రితమే ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని, తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఉస్మానియాలోనే చేసినట్టు బీ నాగేందర్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తాము ఖరీదైన, అరుదైన శస్త్ర చికిత్సలను నిర్వహించగలిగినట్టు డాక్టర్ నాగేందర్, డాక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సల్లో అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏడాది వయస్సున్న చిన్నారికి..
కరీంనగర్కు చెందిన ఏడాది వయస్సున్న చిన్నారి వివాన్కు పి ఫిక్ సోకింది. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో తల్లి నుంచి కొంత కాలేయ భాగం సేకరించి, లివింగ్ డోనార్ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
ఎనిమిదేండ్ల చిన్నారికి..
మరో కేసులో ఎనిమిదేండ్ల వయస్సున్న చిన్నారి ఆలమ్ సైతం పి-ఫిక్ వ్యాధితోనే బాధపడుతున్నాడు. కామెర్లు, రక్తపువాంతులతో కోమాలోకి వెళ్లాడు. చిన్నారిని కుటుంబసభ్యులు ఉస్మానియా దవాఖానకు తరలించడంతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు కాపాడారు.
పి-ఫిక్ వ్యాధి కారణాలు, లక్షణాలు
కొన్ని రకాల జన్యులోపాల కారణంగా ఆమ్లాలు తయారవ్వడానికి అవసరమైన ప్రొటీన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. ఆమ్లాల ఉత్పత్తి తగ్గిపోవడంతో కాలేయం హానికర విషపదార్ధాలను తొలగించలేదు. దీంతో అవి రక్తంలోనే ఉండిపోతాయి. ఫలితంగా కొవ్వు, కొన్ని రకాల విటమిన్లు కరగకుండా రక్తంలోనే ఉండిపోతాయి. దీంతో కాలేఉయం పనిచేయదు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే రోగి మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి సోకినవారికి ఒంటిపై తీవ్రమైన దురద, బరువు తగ్గడం, ఎదుగుదల లేకపోవడం, కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.