సుల్తాన్బజార్, సెప్టెంబర్ 4 : మానసిక వైకల్యంతో బాధపడుతూ బ్లేడ్లు మింగి ప్రాణాలపైకి తెచ్చుకున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. తాండూరులోని ఇందిరానగర్కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ కుమారుడు ముజీబుర్ రహమాన్ (16) మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 3న రేజర్ బ్లేడ్లు మింగిన ముజీబుర్ రహమాన్ను తండ్రి గమనించి ఉస్మానియా దవాఖానకు తీసుకొచ్చారు.
యువకుడికి ఎక్స్రే, ఇతర పరీక్షలు చేసిన జనరల్ సర్జరీ విభాగం వైద్యులు.. తదుపరి చికిత్స నిమిత్తం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి రిఫర్ చేశారు. అనంతరం మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రమేశ్, అసోసియేట్ ప్రొఫెసర్ సాహిత్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆశికా, సయ్యద్ నదీమ్ తదితరులు ఎండోస్కోపీ పద్ధతిలో ముజీబుర్ రహమాన్ ఉదర భాగం నుంచి బ్లేడ్ ముక్కలు తొలగించారు. యువకుడి దేహంలోని ఇతర భాగాలకు ఎలాంటి గాయాలవకుండా సురక్షితంగా శస్త్రచికిత్స పూర్తిచేసిన రమేశ్ కుమార్ బృందాన్ని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్ ప్రత్యేకంగా అభినందించారు.