హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో సోమవారం రాష్ట్ర క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయాలు ప్రజల జీవితాలపై చెరగని సంతకం చేస్తాయని చెప్పారు. మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఎన్నడూ తీసుకోనివిధంగా ఉద్యోగుల పట్ల ఎంతో ఔదార్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని తెలిపారు. 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకొన్న ప్రభుత్వం, తాజా గా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీయతను చాటి చెప్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఒకటిరెండు రోజుల్లో అటు వీఆర్ఏల కుటుంబాలతోనూ, ఇటు ఆర్టీసీ కార్మికులతో నూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జీలకు సూచించారు. రాష్ట్రంలోని అనాథలందరినీ ఒక పాలసీ కిందకు తీసుకొచ్చి, వారి బాధ్యతను స్వయంగా తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా అత్యంత మానవీయతతో కూడుకొన్నదని కేటీఆర్ అన్నారు.
మెట్రో మెరుపుతో..
రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. విస్తరణ తర్వాత మెట్రో అందుబాటులోకి వచ్చే నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతమవుతుందని, నగర విస్తరణకు అనేక సానుకూల అంశాలు ఏర్పడతాయన్న అంశాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. మెట్రో విస్తరణ పూర్తయితే హైదరాబాద్ చుట్టుపకల సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలని తెలిపారు. భారీ వర్షాలకు ఇబ్బందులుపాలైనవారికి తక్షణ సహాయంగా ప్రకటించిన రూ.500 కోట్లు ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలన్నింటిపైనా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజలకు ప్రభుత్వ ఆలోచనలను వివరించాలని ఆదేశించారు.