హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మంత్రి గంగుల ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రం లీకైందని, అప్పుడు నాటి సీఎం, లేదా ఇతర మంత్రులు రాజీనామా చేయలేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న పలు రాష్ర్టాలలో వందల సంఖ్యలో ప్రశ్న పత్రాలు లీకయ్యాయని, అక్కడ కూడా సీఎంలు, మంత్రులు రాజీనామా చేయడం లేదని తెలిపారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ రాజ్యాంగబద్ద సంస్థ అని, వాటికి ప్రభుత్వానికి సంబంధం ఉండదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా పాదయాత్రలు చేస్తూ.. వాటికి ప్రచారం కోసమే మంత్రి కేటీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్లోని రెండు గ్రూపుల కుమ్ములాటలను పక్కదారి పట్టించడానిరే రేవంత్రెడ్డి పేపర్ లీకేజీ అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
యువతలో భయాందోళనలు సృష్టిస్తున్న రేవంత్, బండి సంజయ్.. వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్కాంలకు పెట్టింది పేరు కాంగ్రెస్ అని, స్కాంల ప్రభుత్వం నడిపింది వైఎస్ రాజశేఖర్రెడ్డి అని.. ఇప్పుడు ఆయన బిడ్డ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. సిరిసిల్లకు వెళ్లిన షర్మిలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ర్టాలలో అనేక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, అక్కడి ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామా చేశారా? అని గంగుల నిలదీశారు. గతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు కూడా లీకయ్యాయని, అప్పుడు ప్రధాని రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.
జీవన్రెడ్డికి సంబంధం ఉండొచ్చు కదా?
టీఎస్పీఎస్సీ ద్వారా 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఎకడా చిన్న ఆరోపణలు కూడా రాలేదని మంత్రి గంగుల గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు తప్పుచేస్తే తక్షణమే అరెస్ట్ చేశామని చెప్పారు.పేపర్ల లీకేజీని ప్రభుత్వమే ముందుగా గుర్తించిందని, కాంగ్రెస్, బీజేపీలు కనుగొన్నది ఏమీ లేదని అన్నారు. నిందితుడు రాజశేఖర్రెడ్డి జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి, అతని స్వగ్రామం సమీపంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఊరు కూడా ఉంటుందని, ఈ పేపర్ల లీకేజీలో జీవన్రెడ్డికి సంబంధం ఉండొచ్చు కదా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం ప్రభుత్వానికి అంటగట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ విప్ భానుప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు చూస్తే భావదారిద్య్రం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. గుజరాత్కు చెందిన అనేకమంది వ్యాపారులు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని, వారందరూ ప్రధాని మోదీ బంధువులేనా అని ప్రశ్నించారు.