హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథాశ్రమం అందించిన సహకారంతో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. తాజాగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎఫ్ఏఐ) బిజినెస్ స్కూల్లో ఎంబీఏ ప్రవేశానికి ఎంపికయ్యాడు. ఆర్థిక స్థోమత లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పొన్నం ప్రణీత్. పెద్దపల్లి జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన ప్రణీత్ 87 శాతం మార్కులతో పాసయ్యాడు. అనంతరం తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారాడు. ఉన్నత చదువు చదవాలనే ప్రణీత్ తపన చూసి హైదరాబాద్ ఎల్బీనగర్లోని అనాథ విద్యార్థి గృహం చేరదీసింది.
ఆశ్రయం కల్పించడంతోపాటు సిల్వర్జూబ్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్ 70 శాతం మార్కులతో, అరోరా కాలేజీలో డిగ్రీని 85 శాతం మార్కులతో పూర్తి చేశాడు. ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలోనూ ప్రణీత్ సత్తా చాటాడు. బెంగళూరు ఐఎస్బీలో రెండేండ్ల ఎంబీఏ సీటు సాధించాడు. కానీ, ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. కోర్సు నాలుగు సెమిస్టర్ల ఫీజు మొత్తం రూ.11.26 లక్షలను ఐఎస్బీ మేనేజ్మెంట్ మాఫీ చేసినా, భోజనం, వసతి, పుస్తకాలు తదితర అవసరాలకు మరో రూ.4 లక్షల వరకు కావాల్సి ఉన్నదని ప్రణీత్ వెల్లడించారు. దాతలు ఆదుకోవాలని ప్రణీత్తోపాటు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ విజ్ఞప్తి చేశారు. వివరాలకు 99857 20394నంబర్లో సంప్రదించాలని కోరారు.