Congress | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో సీనియర్ నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించే కుట్ర జరుగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో సుమారు 20 మంది సీనియర్లకు అధిష్ఠానం చోటివ్వలేదని అంటున్నారు. మొదటి జాబితాలో స్థానం దక్కని వారు రాష్ట్రస్థాయిలో కొంత పేరున్న వారు కాగా.. వీరు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారై ఉండటం గమనార్హం. ఇటువంటి సీనియర్లను విస్మరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలనే పార్టీలోకి వలస వచ్చిన వారికి టికెట్లిచ్చిన అధిష్ఠానం తమను విస్మరించడంపై వారు.. ‘కొత్తవారికంటే మేము హీనమా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేండ్లుగా పార్టీకి విధేయులగా ఉన్న తమను ఇది అవమానించడమేనని అంటున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం వీరికి టికెట్లు ఇవ్వొద్దని భావిస్తున్నదా? అందుకే కావాలనే వారిని దూరం పెట్టిందా? అంటూ రాజకీయ పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రెండో జాబితాలోనైనా వీరికి చోటు దక్కుతుందా అని ప్రశ్నిస్తున్నారు. మొదటి జాబితాలో చోటు దక్కని సీనియర్ నేతలలో మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, కొండా దంపతులు, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, రాంరెడ్డి దామోదర్రెడ్డి, అజారుద్దీన్, విష్ణువర్దన్రెడ్డి, బాలు నాయక్, వీ హన్మంతరావు, సురేశ్ షెట్కర్, మహేశ్కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, సర్వే సత్యనారాయణ, మల్రెడ్డి రంగారెడ్డి, ఈరవత్రి అనిల్ ఉన్నారు. అధిష్ఠానానికి అత్యంత సన్నిహితునిగా పేరున్న మధుయాష్కీ గౌడ్ పేరు లేకపోవడంపై నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్, కొండా దంపతుల్లో ఒక్కరికైనా చోటు దక్కకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతున్నది.
ఇటీవలో కాంగ్రెస్లో చేరిన జూపల్లి కృష్ణారావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, వేముల వీరేశం, వినయ్కుమార్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి వంటి పాత, కొత్త నేతలకు మొదటి జాబితాలో చోటు కల్పించిన అధిష్టానం మిగిలిన సీనియర్ నేతలను ఎందుకు విస్మరించిందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ‘ఎలాంటి ఇబ్బంది లేనటువంటి, ఒకే దరఖాస్తు వచ్చిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం’ అంటూ పార్టీ నేతలు తొలి జాబితా ప్రకటన సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. దీని ప్రకారం మిగిలిన సీట్లలో ఇబ్బందులు ఉన్నాయని తేలిపోయింది.
మిగిలిన సీనియర్ నేతలకు ఆయా స్థానాల్లో పెద్దగా ప్రాభవం లేదని పార్టీ తేల్చేసిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో రెండో జాబితాలోనూ మిగిలిన సీనియర్లలో ఎంత మందికి స్థానం దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. టికెట్ దక్కని పలువురు సీనియర్లు మధుయాష్కీ ఇంట్లో భేటీ అయ్యారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాజయ్య, సురేశ్ షెట్కర్ ఉన్నారు. తొలి జాబితాలో టికెట్ రాకపోవడానికి గల కారణంపై వీరి చర్చించినట్టు తెలిసింది. రెండో జాబితాలోనూ టికెట్ దక్కకపోతే ఏం చేయాలనేదానిపై కూడా వీరి చర్చించినట్టు సమాచారం.