హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తూ, అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్వర్క్ గుట్టును ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’ పేరిట తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. గత నెల 25న ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించినట్టు తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నుంచి సేకరించిన డాటాను విశ్లేషించి ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు. మొత్తం 517 మంది సిబ్బందితో 137 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 137 బ్యాంకు శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు.
ఈ తనిఖీల్లో దేశవ్యాప్తంగా సుమారు 9,541 నేరాలను గుర్తించినట్టు శిఖాగోయల్ తెలిపారు. దాదాపు రూ.100 కోట్ల నష్టానికి కారణమైన 1,888 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ధ్రువీకరించినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 626 మంది అనుమానితులను గుర్తించగా వారిలో 208 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారిలో 15 మంది మహిళలు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, విద్యుత్తుశాఖలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నట్టు వెల్లడించారు. వీరంతా తమ బ్యాంకు ఖాతాలను సైబర్ మోసగాళ్లకు అద్దెకు ఇచ్చి, ప్రతి లావాదేవీపై 5శాతం వరకు కమీషన్ తీసుకున్నట్టు విచారణలో తేలినట్టు వివరించారు.
వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు 112 బీఎన్ఎస్ను ఈ కేసుల్లో ప్రయోగించామని వెల్లడించారు. ఖాతాలు తెరువడానికి సహకరించే వారిని గుర్తించి వారిపై నిఘా పెంచినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కమీషన్ల కోసం ఖాతాలను అద్దెకు ఇవ్వడం నేరమని హెచ్చరించారు.