హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల నీటి అవసరాల డిమాండే ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు ప్రామాణికమని, వాటిని సంబంధిత ట్రిబ్యునల్ మాత్రమే ఖరారు చేస్తుందని తెలంగాణ తరపు సాక్షి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యుసీ) రిటైర్డ్ సీఈ చేతన్పండిట్ స్పష్టం చేశారు. రూల్ కర్వ్స్ కన్నా ఆపరేషన్ ప్రొటోకాల్ అత్యున్నతమైనదని, దానిపై ఆధారపడే రూల్కర్వ్ను రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాల పంపిణీ, ఆపరేషన్ ప్రొటోకాల్ ఏర్పాటుపై చేపట్టిన బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర నేతృత్వంలో ఢిల్లీలో గురువారం కూడా కొనసాగింది. సీడబ్ల్యుసీ రిటైర్డ్ సీఈ చేతన్ పండిట్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
ఇటీవల కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) డ్రాఫ్ట్ రూల్కర్వ్పై పలు ప్రశ్నలను అడగగా, తెలంగాణ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆపరేషన్ ప్రొటోకాల్, రూల్కర్వ్స్, శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ను 809కి నిర్దేశిస్తూ ఉమ్మడి ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 69 అంశాలను ఏపీ సీనియర్ న్యాయవాది ప్రస్తావించగా, చేతన్పండిట్ దీటుగా బదులిచ్చారు. రూల్కర్వ్స్ కన్నా ఆపరేషన్ ప్రొటోకాల్ అత్యున్నతమైనవని స్పష్టం చేశారు. ఆపరేషన్ ప్రొటోకాల్ రూపొందించిన అనంతరం రూల్కర్వ్స్ను రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు. విచారణకు తెలంగాణ తరపు న్యాయవాది రవీందర్రావు, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ విజయ్కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. శుక్రవారం కూడా ట్రిబ్యునల్ విచారణ కొనసాగనున్నది.
తెలంగాణ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్కు సమాధానం ఇచ్చేందుకు రెండు వారాల గడువు కావాలని ఏపీ కోరగా ట్రిబ్యునల్ అంగీకరించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ సర్కారు విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ ట్రిబ్యునల్లో ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వానికి 4 వారాలు, కౌంటర్కు రిైప్లె ఇచ్చేందుకు 2 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ రిైప్లె దాఖలు చేయగా, ఏపీ రిైప్లె కౌంటర్ వేయలేదు. మరో రెండువారాల గడువు కావాలని ఏపీ కోరడంతో ట్రిబ్యునల్ అనుమతిచ్చింది.