నల్లగొండ ప్రతినిధి/ హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఎరువుల ధరలు పెంచుతూ రైతు జేబుకు చిల్లు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు ఏడేండ్లలో రైతులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రకటన విడుదల చేసిన మంత్రి.. అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని ఫైర్ అయ్యారు. రైతాంగాన్ని ఆదుకోవటం కోసం సీఎం కేసీఆర్ విప్లవాత్మక బాటలు వేశారని, సీఎం విధానాల వల్లే రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగిందని చెప్పారు. మోదీ సరార్ మాత్రం దళారుల ఆదాయాన్నే రెండింతలు చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలతో రైతు జేబుకు చిల్లు పడిందని అన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా, రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొస్తే సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోదీ రాష్ట్ర నాయకులతో ఊరకుకల్లా మోరిగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంచేశారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు. పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించే దాకా రైతాంగం పోరాటాలకు సిద్ధం కావాలని, బీజేపీ దుర్మార్గపు నీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.