బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం జరిగిదంటే అది కేవలం కేసీఆర్ పాలనలోనేనని తెలిపారు. అన్ని సమయాల్లోనూ మైనార్టీలకు బీఆర్ఎస్సే అండగా నిలిచిందని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో మంగళవారం ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని మహమూద్ అలీ సూచించారు. ఆ పార్టీ మైనార్టీల ఓట్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మైనార్టీలకు అండగా నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్కు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.