హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి, దవాఖానలకు తరలించేవారికి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగటం, సాక్ష్యాలు చెప్పటం వంటి తలనొప్పులు లేకుండా కేంద్రప్రభుత్వం మరింత భరోసా ఇస్తున్నది. బాధితులకు సాయం చేసినవారికి రూ.5 వేలు నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రాన్ని అందించే కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించనున్నది. ఏడాదిలో ఇలా రోడ్డు ప్రమాద బాధితులను రక్షించడంలో మానవత్వం చూపిన పదిమంది ఉత్తమ పౌరులను ఎంపికచేసి వారికి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందించాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెండురోజుల క్రితం అన్ని రాష్ర్టాల రవాణాశాఖ కార్యదర్శులు, కమిషనర్లకు ఆదేశాలు అందాయి. వారి ద్వారా పోలీస్, ఆరోగ్యశాఖలకు సమాచారం పంపారు.