TSPSC Group-1 | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్కు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆదరణ తగ్గినట్టుగా కనిపిస్తున్నది. గత నెల 19న గ్రూప్1 నోటిఫికేషన్ జారీ కాగా, అదే నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 14 వరకు దరఖాస్తుల తుది గడువుగా నిర్ణయించారు. అయితే, 13 వరకు (బుధవారం) 2.70 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొన్నారని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పాత గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 500 పోస్టులకు భారీగా 3.80 లక్షల దరఖాస్తులు నమోదైనట్టు గతంలో టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుతం గ్రూప్1 ఉద్యోగాలకు పోటీపడేందుకు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపుతలేరన్న విషయం తేటతెల్లమవుతుంది.
5.50 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా..
ఇదిలావుండగా, కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్లో మొత్తం 563 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దాదాపు 5.50 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉన్నదని టీఎస్పీఎస్సీ అధికారులు అంచనా వేశారు. కానీ, కేవలం 2.70 లక్షల దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. దరఖాస్తులకు గురువారం తుది గడువుగా ఉన్నది. ఒక్క రోజులో ఎంతలేదన్నప్పటికీ మరో 50 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. ఈసారి గ్రూప్-1లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకొంటారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావించింది. వచ్చే లోకసభ ఎన్నికలలో నిరుద్యోగ అభ్యర్థులను కూడా ప్రసన్నం చేసుకోవచ్చని ఆశించింది. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి.