హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల్లో 17,74,624 మంది వద్ద ఎలక్ట్రానిక్ ఉపకరణాలున్నట్టు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల వంటి ఏదో ఒక డిజిటల్ ఉపకరణం విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. 1,12,559 (6.06 శాతం) మంది వద్ద మాత్రమే ఎలాంటి డిజిటల్ డివైజ్లు లేవని లెక్కతేల్చింది. ఆన్లైన్ బోధన నేపథ్యంలో రెండురోజులుగా పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. టీచర్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలున్న విద్యార్థుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపగా, ఆ వివరాలను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. 3 నుంచి10 తరగతుల్లో మొత్తం 18,57,183 విద్యార్థులున్నారు. ఈ నెల 1 నుంచి ఆన్లైన్ క్లాసులు మొదలుకాగా, రెండోరోజు 12,68, 291 (68.29 శాతం) మంది విద్యార్థులు తరగతులకు హాజరైనట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.