హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు నేటినుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. టీశాట్ ద్వారా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు సోమవారం నుంచి డిజిటల్ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించనున్నారు. ఈ నెల 28 వరకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా ఆన్లైన్ పాఠాలు ప్రసారం చేస్తారు.
ఈనేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది 50 శాతం హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కాగా, కరోనా మొదటి, రెండో వేవ్ల కారణంగా గతేడాది మార్చి నుంచి విద్యాసంస్థల్లో పూర్తిగా ఆన్లైన్లోనే విద్యాబోధన జరిగిన విషయం తెలిసిందే.
అయితే కరోనా కేసులు తగ్గుముఖంపట్టడంతో గత సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమయింది. దీంతో సెలవులు మినహాయిస్తే మొత్తం మూడు నెలలపాటు ప్రత్యక్ష పద్ధతిలో తరగతులు జరిగాయి. మళ్లీ కరోనా విజృంభించడంతో విద్యార్థులు మరోసారి ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది.