హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష బోధనా.. ఆన్లైన్ క్లాసులా అన్న సందిగ్ధతకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులనే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలను తెరిచే పరిస్థితులు లేకపోవటంతో జూలై 1 నుంచి ఆన్లైన్ బోధనను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం తెలిపారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులందరికీ ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. విద్యార్థులు నష్టపోకుండా గుణాత్మకమైన డిజిటల్/ఆన్లైన్ తరగతులు ఉంటాయని మంత్రి వివరించారు. విద్యాసంస్థల ప్రారంభం, ఆన్లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సోమవారం గన్ఫౌండ్రీలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ క్లాసులపై మంత్రి కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు టెలివిజన్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా పాఠాలు వీక్షించవచ్చని, ఇవేవీ లేని విద్యార్థులు గ్రామ పంచాయతీలు, గ్రంథాలయాల్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించనున్నామని తెలిపారు. టీశాట్ పాఠాలు వీక్షించలేని వారికోసం టీశాట్ యాప్లో, దూరదర్శన్ యూట్యూబ్ చానల్లో ప్రసారాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎస్సీఈఆర్టీ ద్వారా వర్క్షీట్లను సైతం అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేసేందుకు 75వేల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు అతి త్వరలో పాఠ్యపుస్తకాలను అందజేస్తామని, ఇప్పటికే 90% పుస్తకాలు స్కూళ్లకు చేరుకున్నాయని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు 50% ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరవుతూ ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని అన్నారు. ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలను జూలైలో నిర్వహించాలని, ఇందుకు ఆయా యూనివర్సిటీలు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అన్ని ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని, జూలైలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షల్లో మార్పు లేదని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, కోచింగ్ సెంటర్లు సహా ఇతరత్రా విద్యాసంస్థలన్నింటినీ జూలై 1 నుంచి ప్రారంభించి, ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం మెమోను జారీచేశారు.