హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే స్ఫూర్తితో మున్ముందు అన్ని శాఖల్లో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా త్వరలో మున్సిపల్, దేవాదాయ శాఖల్లో ఆన్లైన్ ఆడిట్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ మార్తినేని వెంకటేశ్వర్రావు వెల్లడించారు. గ్రామ పంచాయతీల్లోని వివిధ సమస్యలకు పరిష్కారం చూపేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం..
ఆ కమిటీల్లో తెలంగాణ నుంచి మార్తినేనికి మాత్రమే చోటు కల్పించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలంటే దశలవారీగా అన్ని గ్రామాల్లో ఆన్లైన్ ఆడిట్ చేయాలని కేంద్రప్రభుత్వం నిబంధన విధించింది. దీన్ని ఇతర రాష్ట్రాలు అంతగా పట్టించుకోనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామాలను ఆన్లైన్ ఆడిట్ చేసినట్టు మార్తినేని తెలిపారు. ఆన్లైన్ ఆడిట్ ద్వారా గ్రామపంచాయతీల్లో ఆర్థిక క్రమశిక్షణతోపాటు జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ర్టాలు తెలంగాణను సంప్రదిస్తున్నాయని మార్తినేని చెప్పారు.