హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులకు రక్షణ కరువైంది. తమ మతానికో, తమ పార్టీకో వ్యతిరేకంగా వాస్తవాలు ప్రచురిస్తే, ప్రసారం చేస్తే చాలు నిర్లజ్జగా, నిర్భయంగా వెంటపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతూ వ్యక్తిత్వహననానికి దిగుతున్నారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వీయాదవ్లతో మొదలైన ఈ దాడుల పరంపర.. తులసీచందు, సరిత, విజయారెడ్డిల నుంచి నేటి శ్రీనిధి విప్లవ వరకూ ఈ అకృత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ ‘స్టాండ్ విత్ హర్’ అమలవుతుందో చెప్పాలని మహిజా జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ధర్నాచౌక్లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ధర్నాను కవర్ చేసిన డిజిటల్ మీడియా జర్నలిస్టు శ్రీనిధి విప్లవశ్రీని టార్గెట్ చేశారు.
యువ మహిళా జర్నలిస్టు శ్రీనిధి విప్లవశ్రీ సీజేపీ కార్యక్రమాన్ని కవర్ చేయడం, యువత అభిప్రాయాలతో తన ‘జీ8 చానెల్’లో ప్రసారం చేయడంతో మతోన్మాదులు రెచ్చిపోయారు. ‘వంశీకృష్ణ దేవీ’ అనే ఫేస్బుక్ యూజర్..అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ ఫొటోను షేర్ చేశాడు. దానిని మతోన్మాద గ్రూపుల్లో విపరీతంగా ట్రోల్ చేయడంతోపాటు సోషల్మీడియా అన్ని వేదికల్లోనూ పోస్టు చేశారు. దీంతో సామాజిక కార్యకర్తలు, ప్రముఖ జర్నలిస్టులు, నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ చేస్తున్న వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
యువ జర్నలిస్ట్ శ్రీనిధి విప్లవ అంశంపై ప్రముఖ సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్ స్పందించారు. ‘అశ్లీల మార్ఫింగులు వికృత రాజకీయ, సాంస్కృతిక దాడులు! సాహస ప్రజా జర్నలిస్టు శ్రీనిధి విప్లవశ్రీకి సంఘీభావం’ అంటూ తన మద్దతు తెలిపారు. శ్రీనిధికి మద్దతుగా పలువురు కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు మద్దతుగా నిలిచారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో మద్దతుగా ‘ఐ స్టాండ్ విత్ శ్రీనిధి విప్లవ శ్రీ’ అంటూ హ్యాష్ ట్యాగ్లు పెడుతున్నారు. మహిళా జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా రాబోయే కాలంలో ట్రోలింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికోసమే ఓ వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.
కనీసం ముఖం చూపించలేని పిరికి, మతోన్మాద శక్తులు ఒక యువ మహిళా జర్నలిస్టు ఫొటోలను మార్ఫింగ్ చేయడంపై జర్నలిస్టు తులసీ చందు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వాళ్లకు కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేని స్థితిలో తెలంగాణ పోలీసు వ్యవస్థ ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి ఘటనలపై మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా పోలీసులు సీరియస్గా తీసుకోలేదని ఆమె చెబుతున్నారు. కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
అలాంటి చర్యలు తీసుకోలేకపోతే ‘ఉమెన్ జర్నలిస్టులకు మేం భరోసా ఇవ్వలేం.. మీరు జర్నలిజం వృత్తి మానెయ్యండి’ అనైనా బహిరంగ ప్రకటన విడుదల చేయాలని పోలీసులను ఆమె కోరుతున్నారు. తనతో పాటు సుమారు 20 మంది ఉమెన్ జర్నలిస్టులు కొన్ని నెలల క్రితం హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి ఒక మతోన్మాది పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం అకౌంట్ను, పెట్టిన పోస్టులను కూడా డిలీట్ చేయించలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.