మంగపేట, మే 31: అభం శుభం తెలియని ఏడాది వయసున్న బాబు ఆడుకుంటూ వెళ్లి చేతికందిన పురుగు మందు డబ్బా మూతను నోట్లో పెట్టుకోవడంతో అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన కొమరం రాజు-రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు.
చిన్నవాడైన ఏడాది వయసున్న సాయిదేవ్ సోమవారం ఇంటి వద్ద అంబాడుకుంటూ వెళ్లి వ్యవసాయ పనుల కోసం తెచ్చిన పురుగు మందు డబ్బా మూతలో ఉన్న మందును తెలియక తాగాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఏటూరునాగారం, అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతిచెందాడు. కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.