TS Minister Jagadish Reddy | కాళేశ్వరం జలాలతో తొలిసారి లబ్ధి పొందిన సూర్యాపేట జిల్లా రైతులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు వినూత్న కార్యక్రమం రూపొందించారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్ఓ భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవ నిర్వహణకు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో `కాళేశ్వర జలాలతో లక్ష హారతి` అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం మంత్రి జగదీశ్ రెడ్డి.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కాళేశ్వరం జలాలు పారే ఏడూ మండలాల్లోని 126 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. నాగరం మండలం ఈటూరు నుండి పెన్పహాడ్ మండలం రావి చెరువు వరకు 68 కిలో మీటర్ల పొడవునా లక్ష మందితో కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు కాళేశ్వరం జలాలకు లక్ష హారతి కార్యక్రమం బొడ్డు రాయి పండగను మరిపించేలా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసేలా అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. ప్రతి 250 మీటర్లకు ఒకరు చొప్పున 280 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. అడుగడుగునా వైద్య బృందాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగాన్ని నియమించారు. ఎక్కడి కక్కడే పూర్తి స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేశారు. మంచినీటి వసతుల ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇప్పటికే బతుకమ్మ, బోనాలతో మంగళ వాయిద్యాలతో ఊరు వాడ కదిలేలా కాళేశ్వరం జలాలతో లబ్ది పొందిన రైతాంగం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాళేశ్వరం జలాలతో మొట్ట మొదట లబ్ది పొందిన యావత్ సూర్యాపేట జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎక్కడి ప్రజాప్రతినిధులు అక్కడే పాల్గొననున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, తుంగతుర్తిలో స్థానిక శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్, కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొంటారు.
మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, నీటి పారుదల అధికారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.