హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు గ్రామాల్లో గుండెపోటుకు గురైతే బాధితులు పట్నందాకా పరుగులు పెట్టాల్సి వచ్చేది. కానీ, నేడు అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాల్లోని గుండెపోటు బాధితులకు అత్యవసర చికిత్స అందించి, ప్రాణాలు నిలిపే లక్ష్యంతో వైద్యారోగ్యశాఖ 2020 జనవరి నుంచి ‘స్టెమీ’ (ఎస్టీ-ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారక్షన్) పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నది.
ఒకప్పుడు గుండెపోటు 50 నుంచి 60 ఏండ్లు పైబడిన వారికే వస్తుందని అనుకొనేవాళ్లం. కానీ, రెండు పదుల వయసు నిండినవాళ్లకు గుండెపోటు వస్తుందని ఊహించగలమా? కానీ, అదే జరుగుతున్నది. గుండెపోటు బాధితుల్లో 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న వారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. సాధారణంగా గుండెకు రక్తం సరఫరా చేసే నాళం పూర్తిగా మూసుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘స్టెమీ’ అని పిలుస్తారు. లక్షణాలను గుర్తించి.. సమీపంలోని దవాఖానకు తరలించి.. గుండెపోటుగా నిర్ధారించి.. అవసరమైన చికిత్స అందించాలి.
దీనికి గరిష్ఠంగా ఆరు గంటల సమయం ఉంటున్నది. దీనినే గోల్డెన్ అవర్ అంటాం. కనీసం రక్తనాళాల్లో అడ్డంకిని కరిగించే ‘థ్రాంబోలైసిన్’ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే మరో 6 నుంచి 72 గంటల సమయం కలిసొస్తుంది. గతంలో గుండెపోటు బాధితులను ప్రైవేట్కు లేదా హైదరాబాద్కు తరలించాల్సి వచ్చేది. దీంతో సమయం వృథా అవుతున్నది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం హబ్ అండ్ స్పోక్ విధానంలో ‘స్టెమీ’ పథకాన్ని జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తూ వందలాది మంది రోగుల ప్రాణాలను కాపాడుతున్నది.
ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 74 కేంద్రాల్లో ‘థ్రాంబోలైసిన్’ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతున్నారు. నిమ్స్, ఉస్మానియాతోపాటు వరంగల్ ఎంజీఎం, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా దవాఖానల్లో క్యాథ్ల్యాబ్లను ఏర్పాటు చేశారు. గుండెపోటు లక్షణాలున్న బాధితులను ముందుగా స్పోక్స్కు తరలిస్తారు. అక్కడ ఈసీజీ తీసి గుండెపోటుగా నిర్ధారించుకొన్నాక, థ్రాంబోలైసిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత హబ్స్కు తరలించి సర్జరీ చేసి స్టెంట్లు వేస్తారు.
గత రెండేండ్లలో స్టెమీ కార్యక్రమం కింద 1,84,448 మందికి ఈసీజీలు తీశారు. వాటిల్లో 7,898 మందికి గుండె సంబంధిత సమస్యలున్నట్టు నిర్ధారించారు. సుమారు 800 మందికి గుండెపోటుగా నిర్ధారించి చికిత్స అందించారు. వీరి వయసులను పరిగణనలోకి తీసుకొని విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
కొద్ది దూరం నడిచినా, కొన్ని నిమిషా లే పనిచేసినా తీవ్ర ఆయాసం వస్తే అనుమానించాల్సిందే. ఒక్కసారిగా విపరీతంగా చెమటలు పట్టడం, గుండె దడగా అనిపించడం, అలసట, కాళ్లవాపు, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, చాతీ మధ్యభాగంలో నొప్పిగా అనిపించడం, బరువు పెట్టినట్టు ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. రక్తపోటు, మధుమేహం, పొగతాగడం, గుట్కాలు, పొగాకు నమలడం, శారీరక శ్రమలేకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉండటం, వంశపారంపర్యంగా గుండె జబ్బులున్న వారిలో హృదయ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
గుండెపోటు బాధితులకు వేగంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండేండ్ల కింద స్టెమీ కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. గుండెపోటు లక్షణాలతో బాధపడుతున్న వారికి స్టెమీ కేంద్రాలు ఆ పద్బాంధవులుగా నిలుస్తున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తున్నాం. దీంతో వారి ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. ఇలాంటి కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో అమలవుతున్నది.
గుండెపోటు బాధితుల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో స్టెమీని అమలు చేస్తున్నాం. అన్నికేంద్రాలు కలిపి రోజుకు సగటున 700 నుంచి 800 ఈసీజీలు తీస్తున్నారు. వీటిని ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషిస్తుంది. ఏమైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఇదంతా 2 నుంచి 3 నిమిషాల్లోనే పూర్తవుతుంది. గుండెపోటుగా నిర్ధారిస్తే వెంటనే ఆ కేంద్రంలోనే థ్రాంబోలైసిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత స్టెంట్ల కోసం సమీపంలోని పెద్ద దవాఖానకు పంపిస్తాం. ఇప్పుడు అన్ని వయసుల వారికి గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన విధానంతో ముప్పు తగ్గించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం, అతిగా ఆల్కహాల్ తీసుకోకపోవడం వంటివి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
– డాక్టర్ రఘు కిశోర్ గల్లా, స్టేట్ నోడల్ ఆఫీసర్, స్టెమీ