యాదగిరిగుట్ట, మార్చి 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్ర ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం గురువారం అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహులను దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠించారు. ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణదారులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద, ప్రబంధ పారాయణాల మధ్య ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. అనంతరం తిరుమాడ వీధులు, శివాలయం గుండా విష్ణుపుష్కరిణి వద్ద పూజలు జరిపారు. అనంతరం పుష్కరిణిలో గల పవిత్ర జలంతో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడికి స్నానమాచరించారు.
ఈ సమయంలో భక్తుల జయజయ హర్షధ్వానాల మధ్య పుష్కరిణి ప్రాంగణం మార్మోగింది. అనంతరం పుణ్యజలాలను ప్రత్యేకంగా ప్రచార రథంపై కొండ కింద గల లక్ష్మీపుష్కరిణిలో కలుపగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ వైదిక కార్యక్రమాల్లో సాయంత్రం కల్యాణ లక్ష్మీనరసింహుడికు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన శాస్ర్తోక్తంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక, ధార్మిక సభలకు ముగింపు పలికారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో ఎన్ గీత, డీఈవో దోర్బల భాస్కర్, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి.