హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బేసిక్ పే లేదా పెన్షన్పై 2.73% పెంచుతున్నట్టు తెలిపింది. దీనిని 2022 జనవరి నుంచి వర్తింపజేయనున్నట్టు వెల్లడించింది. పెంచిన డీఏను జూలై వేతనంతో కలిపి చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.1,380.09 కోట్ల ఎరియర్స్తోపాటు ప్రతి నెల రూ.81.18 కోట్లు, ఏటా రూ.974.16 కోట్లు అదనపు భారం పడనున్నది. రాష్ట్రంలోని 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనున్నది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ 20.02% నుంచి 22.75 శాతానికి పెరుగనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు డీఏ పెంచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.
డీఏ పెంపు పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలోనూ ఉద్యోగుల పట్ల ఆదరాభిమానాలు చూపుతూ సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 2.73% కరువు భత్యం పెంచడం హర్షణీయమని టీజీవో అధ్యక్షురాలు మమత, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. 2022 జనవరి 1 నుంచి అమలుచేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రి హరీశ్రావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పింగళి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తం చేశారు.