హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర మున్సిపల్శాఖ సన్నద్ధమైంది. సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేయనున్నది. కార్యక్రమంలో భాగంగా ఇండ్లలోని ఎయిర్కూలర్లు, ట్యాంక్లు, డ్రమ్ములు, ఇంకుడు గుంతలు, టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర వాటిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించనున్నారు. గత శుక్రవారం నిర్వహించిన డ్రై-ఫ్రైడే కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,496 మంది పట్టణప్రాంత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని మున్సిపల్శాఖ తెలిపింది.