Engineering Diploma | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మూడేండ్ల కోర్సు పూర్తికాగానే 20కి పైగా సంస్థల్లో స్వాగతం పలికే కొలువులు. ఉన్నత చదువుల వైపు వెళ్లాలనుకుంటే ఉత్తతమమైన కోర్సులు. కోర్సు సమయంలోనే 50 శాతం ప్రాక్టికల్స్. ఇంతటి మేలైన అవకాశాలు ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల సొంతం. పదో తరగతి పరీక్షలు ఫలితాలు రాగానే ఎటువైపు వెళ్లాలన్న.. ఏ కోర్సు తీసుకోవాలన్న సందిగ్ధత విద్యార్థులను పట్టిపీడించడం సహజం. ఇలాంటి వారికి ఈ కోర్సులు చక్కటి అవకాశమని సాంకేతిక విద్యామండలి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీఎస్ పాలిసెట్-24 నోటిఫికేషన్ విడుదల కాగా, ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకునే వీలున్నది. ఆలస్య రుసుంతో ఏప్రిల్ 26 వరకు గడువు ఉన్నది. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహిస్తారు. వివరాల కోసం విద్యార్థులు www.sbtet.telangana.gov. in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. సందేహాలుంటే 040-23222192, 80352 33929 నంబర్లలో సంప్రదించవచ్చు.
అనుకూలతలు.. అవకాశాలు
ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో జాబ్ గ్యారెంటీ ఉంటుంది. ఈ కోర్సులు పూర్తి చేయడం వల్ల మూడేండ్లలోనే మంచి ఉద్యోగం పొందవచ్చు. జీవితంలో స్థిరపడొచ్చు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు పూర్తి చేసినవారు అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు, జూనియర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు అర్హులు. ఇంటర్ ఆ తర్వాత నాలుగేండ్ల బీటెక్ చేయడం, ఎంసెట్ పోటీని తట్టుకోవడం కన్నా డిప్లొమా పూర్తిచేసి, ఈసెట్ ద్వారా సులభంగా తక్కువ పోటీతో బీటెక్ సెకండియర్లో చేరవచ్చు. పాలిటెక్నిక్లో థియరీ, ప్రాక్టికల్స్కు 55:50 చొప్పున మార్కులు ఉంటాయి. అదే ఇంజినీరింగ్లో ప్రాక్టికల్స్కు 20 శాతం మార్కులే మాత్రమే. దీంతో పలు కంపెనీలు పాలిటెక్నిక్తో బీటెక్ పూర్తిచేసిన వారిని ఎంచుకుంటున్నాయి.
విస్తృత ఉద్యోగావకాశాలు
మూడేండ్ల డిప్లొమా పూర్తికాగానే ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్లైన్స్, సింగరేణి, మైనింగ్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ట్రాన్స్పోర్టు, ట్రాన్స్కో, జెన్కో, బీహెచ్ఈఎల్, బీడీఎల్, బెట్, బీఎస్ఎన్ఎల్, డిఫెన్స్, ఎన్టీపీసీ వంటి సంస్థల్లో ఏఈఈ, ఏఈ ఉద్యోగాలు పొందవచ్చు. అనేక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇంజినీరింగ్తోపాటు, అగ్రికల్చర్ వర్సిటీల్లోని డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, సీడ్ టెక్నాలజీ-ఆర్గానిక్ అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా, హార్టికల్చర్ డిప్లొమా కోర్సులతో జీవితంలో స్థిరపడేలా ఉద్యగాలు దొరుకుతాయి.
భవిష్యత్తుకు బంగారు బాటలు
పదో తరగతి ఫలితాల తర్వాత ప్రతి అడుగు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా, జీవిత గమ్యాన్ని నిర్ణయించేలా ఉండాలి. ఇందుకు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కోర్సులు చక్కటి అవకాశం. ఆసక్తి గల విద్యార్థులంతా పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకు దగ్గరి దారిని ఎంచుకోవాలి.
– పుల్లయ్య, కార్యదర్శి, సాంకేతిక విద్యామండలి