బయ్యారం, జనవరి 22: పైసా పైసా కూడేసిన డబ్బులు భద్రంగా దాచుకునేందుకు ఓ వృద్ధురాలు గొయ్యి తీసి పాతి పెట్టింది. అవి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి వెతికి వృద్ధురాలికి డబ్బులను అప్పగించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గు తండాలో సోమవారం చోటుచేసుకున్నది. తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మ చిన్న కిరాణం కొట్టు నడుపుతూ జీవిస్తున్నది. ఈ క్రమంలో తన వద్దనున్న రూ.2 లక్షలు ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకెళ్తారనే భయంతో ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పాతి పెట్టి ఊరికెళ్లింది.
అనంతరం వచ్చిన వృద్ధురాలు డబ్బులు కనిపించకపోవడంతో రెండు రోజుల క్రితం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సోమవారం వృద్ధురాలి ఇంటికొచ్చిన ఎస్సై ఉపేందర్.. తన సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో వెతకగా భూమిలో పాతిపెట్టిన రూ.2 లక్షలు దొరికాయి. ఆ నగదును స్థానిక ఎంపీటీసీ కుమారి, సర్పంచ్ రమేశ్ సమక్షంలో వృద్ధురాలికి అందజేశారు. డబ్బులు బ్యాంకులో దాచుకోవాలని ఎస్సై వృద్ధురాలికి సూచించారు.