హైదరాబాద్: పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. వేకువజామున అమ్మవారికి తొలి పూజల అనంతరం మాజీమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ దంపతులు మొదటి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. మహంకాళికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి శ్రీనివాస్యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.
పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో విరాజిల్లుతుంది. పాతనగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 3 నుంచి 5లక్షల మంది భక్తులు హజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆలయ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. బోనాల దృష్ట్యా ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది.
లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్నమాదన్న దేవాలయం, సుల్తాన్షాహి జగదాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయం, బేలా మాతేశ్వరీ ముత్యాలమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఉప్పుగూడ మహంకాళి ఆలయం, గౌలిపురా భరతమాత మాతేశ్వరీ, మహంకాళి దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం మేకలబండ, మహాకాళేశ్వరస్వామి దేవాలయం మీరాలమండి, దర్బార్ బంగారు మైసమ్మ దేవాలయం అలియాబాద్.