Oil Palm | యాదాద్రి భువనగిరి : ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల రైతుల ఆదాయం( farmers Income ) పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటల కంటే ఈ పంటలో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. భువనగిరి మండలంలోని చీమలకొండూరులోని తన పొలంలో ఆయిల్ పామ్ మొక్కలను కంచెర్ల రామకృష్ణా రెడ్డి శుక్రవారం నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం చేసుకునే అవకాశం ఉండి, నీటి వనరులు ఉంటే ప్రతి రైతు వరి పంటను పండిస్తున్నారని తెలిపారు. లేదంటే పత్తి వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండు పంటలను వేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అయితే రైతులు ఈ రెండు పంటలను వదిలేసి ప్రత్యామ్నాయ పంటల వైపు రావాలని సూచించారు. ఆయిల్ పామ్ను సాగు చేయడం వల్ల అధిక ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు ఆయిల్పామ్ సాగువైపు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కంచెర్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు.