వికారాబాద్, ఆగస్టు 23 : అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని కొనసాగించేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకొంటూ ఏఆర్ డీఎస్పీ, ఏఆర్ ఏఎస్సై ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకా రం.. వికారాబాద్లోని ఎన్నెపల్లికి చెందిన శ్రీకాంత్రెడ్డి ఎస్పీ కార్యాలయంలో ప్లంబర్గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగాన్ని కొనసాగించేందుకు ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ ఏఎస్సై ప్రేమ్సింగ్ శ్రీకాంత్రెడ్డిని 50 వేలు డిమాండ్ చేశారు. 20 రోజుల క్రితం శ్రీకాంత్రెడ్డి రూ.30 వేలు ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం శ్రీకాంత్రెడ్డి నుంచి ప్రేమ్సింగ్ రూ.15 వేలు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. ప్రేమ్సింగ్ను విచారించగా ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ సహకారంతో తీసుకొన్నట్టు చెప్పారు. ఆధారాలు సేకరించిన తరువాత వారిద్దరిని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఆర్మూర్లో సీడీపీవో ఝాన్సీలక్ష్మి..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవో, జిల్లా ఇంచార్జి అధికారి ఝాన్సీలక్ష్మి లంచం తీసుకొంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ కథనం ప్రకారం.. ఝాన్సీలక్ష్మికి మహేందర్ అనే వ్యక్తి కారు ఏడాదిపాటు అద్దెకు ఇచ్చేలా అగ్రిమెంట్ చేశారు. దీన్ని అవకాశంగా తీసుకొన్న సీడీపీవో ప్రతినెలా అద్దెకు సంబంధించి బిల్లు చేయడానికి 3 వేల చొప్పున లంచం ఇవ్వాలని డాటా ఎంట్రీ ఆపరేటర్ అర్చనతో డిమాండ్ చేయించారు. చివరకు నెలకు రూ.1,500 చొప్పున 8 నెలలకు రూ.12 ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. మంగళవారం మహేందర్ నుంచి సీడీపీవో ఝాన్సీలక్ష్మి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు.