హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తమ్ముడి కోసం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు అడ్డదారిలో వెళ్లింది. ఏకంగా టీఎస్పీఎస్సీ ఈ నెల 5న నిర్వహించిన ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాన్నే రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. దానిని తన తమ్ముడికి ఇవ్వడంతోపాటు మరో ఇద్దరికి రూ.13.5 లక్షలకు విక్రయించింది. 12న జరిగే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రం లీక్ అయినట్టు అనుమానాలున్నాయంటూ టీఎస్పీఎస్సీ బేగంబజార్ పోలీసులకు ఈ నెల 11న ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు, లీకయ్యింది 5న జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం అని తేల్చారు. తొమ్మిది మందిని అరెస్టు చేశారు. బషీర్బాగ్లోని పాత కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావుతో కలిసి హైదరాబాద్ సౌత్వెస్ట్జోన్ డీసీపీ కిరణ్ ఖారే కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ అఫీసర్గా పులిదిండి ప్రవీణ్కుమార్ 2017 నుంచి పనిచేస్తున్నాడు. సెక్రటరీకి పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు.
మహబూబ్నగర్ జిల్లా పగిడ్యాల్ పంచంగల్ తాండాకు చెందిన గురుకుల్ పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేసే రేణుక, వికారాబాద్ జిల్లా రూరల్ డెవలప్మెంట్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆమె భర్త లావడ్యావత్ ఢాక్యతో ప్రవీణ్కు పరిచయం ఉన్నది. ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పోటీ పరీక్ష ప్రశ్నపత్రం కావాలని, ఇందుకు రూ.10 లక్షలు ఇస్తామని దంపతులు బేరం కుదుర్చుకొన్నారు. టీఎస్పీఎస్సీలో ఔట్సోర్సింగ్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు రాజశేఖర్రెడ్డితో ఈ డీల్పై చర్చించి వచ్చే డబ్బులో చెరి సగం తీసుకోవాలని ప్రవీణ్ ఒప్పందం చేసుకొన్నాడు. పోటీ పరీక్షల్లో ఉండే సెక్షన్ కస్టోడియన్ శంకరలక్ష్మి అనే ఉద్యోగి సిస్టమ్ పాస్వర్డ్ను తస్కరించి, ల్యాన్లో నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేశారు. పెన్డ్రైవ్లో కాపీ చేసి ప్రింట్ తీశారు. ప్రశ్నపత్రాన్ని రేణుక దంపతులకు అప్పగించి పరీక్షకు ముందు రూ.5 లక్షలు, పరీక్ష తర్వాత 6న మరో రూ. 5లక్షలను ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి తీసుకున్నారు.
రేణుక తన తల్లి మన్సూర్పల్లి తాండ సర్పంచ్ ద్వారా సోదరుడు కేతావత్ రాజేశ్వర్కు ప్రశ్నపత్రాన్ని అందించింది. మేడ్చల్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్కు ఫోన్చేసి ఏఈ ప్రశ్నపత్రం ఉన్నదని, ఒక్కొక్కరికి రూ.10 లక్షలకు ఇస్తానని బేరం పెట్టాడు. తనకు అవసరం లేదని ఎస్ఐ పోస్టుకు ప్రయత్నిస్తున్నానని, తెలిసిన కేతావత్ నీలేశ్నాయక్, పత్లావత్ గోపాల్నాయక్కు పరిచయం చేశాడు. నీలేశ్ తన సోదరుడు కేతావత్ రాజేందర్నాయక్కు ఈ విషయం చెప్పాడు. ఈ ఇద్దరు రాజేశ్వర్ ద్వారా రేణుకకు రూ.13.5 లక్షలు అందించారు. ఆ ఇద్దరిని రెండు రోజులపాటు మహబూబ్నగర్లోని ఒక గదిలో ఉంచి పరీక్షకు సిద్ధం చేశారు. 5న జరిగిన పరీక్షకు నేరుగా వాళ్లిదరిని తీసుకొచ్చి పరీక్ష కేంద్రం వద్ద వదిలేసి వెళ్లారు. పరీక్ష పూర్తయిన తర్వాత ప్రవీణ్ వాళ్లకు ఇవాల్సిన మొత్తం డబ్బు ఇచ్చేసి, తాము రూ.3.5 లక్షలు తీసుకున్నారు.
టీఎస్పీఎస్సీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రవీణ్ ఇంట్లో 5న జరిగిన పరీక్షకు సంబంధించిన పశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఉపయోగించిన పెన్డ్రైవ్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. నివేదికలు అందితే పూర్తి సమాచారం తెలియనున్నది. టీఎస్పీఎస్సీకి సిటీ పోలీసులు పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారానికి కారణమైన ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, రేణుక, ఢాక్య, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్లను అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం వస్తుందని పేర్కొన్నారు. ప్రవీణ్ తండ్రి అదనపు ఎస్పీగా ఉంటూ మరణించడంతో అతనికి కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం వచ్చింది. గతంలో గ్రూప్-1 రాసిన ప్రవీణ్ ప్రిలిమ్స్లో కూడా అర్హత సాధించలేదని తేలింది.