Assigned land | కోనరావుపేట, డిసెంబర్ 11: ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి లాక్కుంటున్నారని బాధిత దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్లో చోటుచేసుకున్నది. కొండాపూర్కు చెందిన మల్యాల నందు గతంలో జనశక్తి పార్టీలో 15 ఏండ్లు పని చేసి లొంగిపోయాడు. ఇందుకుగానూ 2013లో అప్పటి ప్రభుత్వం గ్రామ శివారులోని సర్వే నంబర్ 116ఎలో ఎకరంన్నర భూమిని నందుకు ఇచ్చింది. ఈ భూమిలో నందు ఎవుసం చేసుకుంటున్నాడు.
ఇటీవల రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సదరు భూమి వద్దకు వచ్చి.. ‘రికార్డుల్లో నీ పేరు లేదు.. భూమిని సాగు చేయొద్దు’ అని చెప్పారు. సర్వేయర్తో కొలతలు వేసి, హద్దులు కూడా ఏర్పాటు చేశారు. దీంతో నందు అధికారులను కలిసి 2013లో ఇచ్చిన పట్టా కాగితాలను చూపిస్తే.. అవి సరైనవి కావని పేర్కొన్నారు. సోమవారం తహసీల్దార్ విజయ్ప్రకాశ్రావు, రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు భూమి చుట్టూ ఎక్స్కవేటర్తో కందకం తీశారు. నందు, పద్మ దంపతులు అక్కడికి చేరుకుని తమ భూమి లాక్కోవద్దని ప్రాధేయపడినా వినలేదు.
బాధిత దంపతులు అధికారుల ముందే పురుగుల మందు తాగారు. గమనించిన అధికారులు వెంటనే వారిని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. తహసీల్దార్ను వివరణ కోరగా.. నందు రికార్డుపరంగా లేడని, గతంలోనే అతడికి ఈ విషయం చెప్పామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే కందకం పనులు చేపట్టామన్నారు.