హైదరాబాద్, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ): క్రిస్టియన్లు పరమ పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని ఈ నెల 21వతేదీన అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మతపెద్దలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో 19 (సోమవారం)న సన్నాహాక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రస్థాయి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులతో సమావేశమవుతామని, క్రిస్మస్ ఏర్పాట్లపై చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి హైదరాబాద్కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్లు హాజరవుతారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఎల్బీ స్టేడియం వేదికగా క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నది. క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్లను అందజేయడంతోపాటు విందును ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాదికూడా రూ.33 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చర్చి పరిధిలో 500 మంది చొప్పున మొత్తంగా 2.15 లక్షల మందికి గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్నారు. విందు ఏర్పాట్లకోసం జిల్లాల్లో నియోజకవర్గానికి రూ.2 లక్షలు, జీహెచ్ఎంసీ ఏరియాలో ఒక్కో ప్రాంతానికి రూ. లక్ష నిధులను ఆయా నోడల్ చర్చిల ద్వారా ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అధికారిక క్రిస్మస్ వేడుకల్లో దాదాపు 15వేల మందికి విందు ఇవ్వనున్నది. అలాగే, సమాజసేవ, సాహిత్యం, కళలు, క్రీడలు, విద్య, వైద్యం తదితర రంగాల్లో 30 ఏండ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్న క్రైస్తవ సంస్థలకు గౌరవ పురసారాలు, నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నది.