Secretariat | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారి ఐడీ కార్డులను పరిశీలించిన అనంతరం లంచ్ బాక్సులను తనిఖీ చేయకుండానే లోనికి అనుమతించేందుకు చర్యలు చేపట్టింది. సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలపై తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్రావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్, ఐఏఎస్ శేషాద్రి సోమవారం చర్చించారు.
వాహనాల్లో వచ్చి వెళ్లే అధికారులు, ఉద్యోగులను ఏ సమయంలోనైనా అనుమతించాలని నిర్ణయించారు. పాదచారులను ఆగ్నేయ, ఈశాన్య ద్వారాల గుండా ప్రవేశించేందుకు అనుమతించారు. ఉద్యోగుల లంచ్ బ్యాగులు, హ్యాండ్బ్యాగులను తనిఖీ చేయవద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ భద్రత దృష్ట్యా సాధారణ, మెటల్ డిటెక్టర్ తనిఖీలతోపాటు హ్యాండ్ బ్యాగుల స్కానింగ్ను కొంతకాలం వరకు కొనసాగించాలని నిర్ణయించారు. దీనిపై తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యూసుఫ్ మియా షేక్, సచివాలయ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్కు, పోలీసు ఉన్నతాధికారులకు, నరేంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు.