పిట్లం, అక్టోబర్ 1 : ఓవైపు జలదిగ్బంధంలో చిక్కుకున్న ఊరు.. మరోవైపు డిగ్రీ పరీక్షలు.. ఎలా వెళ్లాలో తెలియక ఆందోళనకు గురైన విద్యార్థులకు అధికారులు ఉపశమనం కల్పించారు. వారికోసం ఏకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేసి నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కుర్తి గ్రామానికి ఓవైపు మంజీరానది, మరోవైపు నిజాంసాగర్ ఉన్నాయి. ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు తెరిచినా వరద గ్రామం చుట్టూ ఉన్న వాగు ద్వారా వెళ్లి మంజీరలో కలుస్తుంది. దీంతో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. ఇటీవల నిజాంసాగర్ గేట్లను తెరవడంతో పది రోజులుగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పరీక్ష ఉన్నదని డిగ్రీ విద్యార్థులు తిరుపతి, నిఖిత, ముక్తాబాయి అభ్యర్థన మేరకు తాసిల్దార్ రామ్మోహన్రావు శుక్రవారం ఉదయం ప్రాజెక్టు గేట్లను మూసివేయించారు. దీంతో విద్యార్థులు వాగును దాటి వెళ్లి పరీక్షరాశారు. గ్రామస్థులు సైతం నిత్యావసరాల కోసం పరుగులు తీశారు. ఎంపీడీవో వెంకటేశ్వర్రావు గ్రామస్థులకు వాగువద్దనే ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. కాగా, సాయంత్రం అధికారులు గేట్లను తిరిగి ఎత్తారు.