Obesity | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ప్యాకేజ్డ్ ఫుడ్ శరీరంలో కొవ్వును పెంచుతుందని, పట్టణవాసుల్లో ఒబెసిటీ (స్థూలకాయం) సమస్యలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ తేల్చింది. రోజుకు సగటున దాదాపు 100 గ్రాముల ప్యాకేజ్డ్ ఫుడ్ మన ఆహారంలో భాగంగా మారుతున్నట్టు గుర్తించింది. అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల చాలా మంది అధిక బరువు, స్థూలకాయం లాంటి సమస్యల బారినపడుతున్నట్టు ఎన్ఐఎన్ పరిశోధకులు తమ అధ్యయన పత్రంలో స్పష్టం చేశారు.
చాక్లెట్లు, అధిక చక్కెర కలిగిన ఆహార పదార్థాలు, బేవరేజెస్, స్వీట్ బిస్కెట్ల లాంటి 100 గ్రాముల ప్యాకేజ్డ్ ఫుడ్తో ఏకంగా 500 కేలరీల శక్తి లభిస్తుందని, ఈ లెక్కన నెలలో మనం కనీసం కిలో బరువు పెరుగుతామని వివరించారు. దీనివల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ లాంటి సమస్యలు అధిక మవుతాయని హెచ్చరించారు. అంతర్జాతీయ సగటుతో పోల్చితే మన దేశంలో అర్థాయుష్షుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని, ప్రతి ముగ్గురిలో ఒకరు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు.