Ichampally | హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): ఎగువన ఎత్తిపోసుకోలేం. దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇదీ గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం. ఇచ్చంపల్లి ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని వేలాది ఎకరాల అటవీ భూమి, పలు గ్రామాలు ముంపు బారినపడటం మరో విషాదం. ఇది రెండు విధాలుగా తెలంగాణను నిలువునా ముంచుడు కార్యక్రమం. ఇక ఎగువనైనా, దిగువనైనా చుక్క నీటిని వాడుకోవాలన్నా కేంద్రం ముందు మోకరిల్లాల్సిందే. వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ భూములు ఇక ఎల్లకాలం ఎండిపోవాల్సిందే.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల ముసుగులో తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నది. అభ్యంతరాలేవీ లెక్క చేయకుండా తమిళనాడులో రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం మొం డిగా, దూకుడుగా వ్యవహరిస్తున్నది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామంటున్న కేంద్రం.. తాజాగా సరికొత్త ప్రతిపాదన చేసింది. మేడిగడ్డను విడిచిపెట్టి, ఇచ్చంపల్లి వద్ద ఎత్తు పెంచి బరాజ్ను నిర్మించి, అక్కడి నుంచి జలాలను కావేరి నదికి తరలించాలని సన్నాహాలు చేస్తున్నది.
ప్రస్తుతం ప్రతిపాదించిన 87 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) వద్ద 15.88 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఇచ్చంపల్లి బరాజ్ను నిర్మిస్తే, దాదాపు 23 వేల ఎకరాలు ముంపునకు గురవుతాయి. వాటితోపాటు మంథని పరిధిలో తొమ్మిది గ్రామాలు మునిగిపోతాయి. దాదాపు 21,575 మంది నిర్వాసితులవుతారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇప్పుడు ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తున్నట్టుగా బరాజ్ ఎత్తును మరింత పెంచితే, అంతకు మూడింతల స్థాయిలో మునక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్దేశిత నీటి లక్ష్యాలు నెరవేరాలన్నా, ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అవసరాలు తీరాలన్నా ఇచ్చంపల్లి వద్ద కనీసం 30-40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును కచ్చితంగా నిర్మించాల్సి ఉంటుందని ఇంజినీర్ల అభిప్రాయం.
అంత సామర్థ్యంతో బరాజ్ను నిర్మిస్తే ఇప్పుడున్న అంచనాలకు మూడింతలకుపైగా భూమి ముంపునకు గురికాక తప్పదు. అదేవిధంగా ముంపు గ్రామాల సంఖ్య, నిర్వాసితులయ్యేవారి సంఖ్య సైతం పెరగకమానదు. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం యావత్ దట్టమైన అటవీ ప్రాంతమే. పర్యావరణపరంగానూ తెలంగాణకు తీరని నష్టమే. నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్కు తరలించేందుకు 315.81 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉంటుంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ మీదుగా వెళ్లే ఈ కాలువ నిర్మాణానికి 18,661 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ రకంగానూ తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోవడం ఖాయం.
మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించకపోతే, ఇచ్చంపల్లి ఎత్తును పెంచి అక్కడి నుంచే గోదావరి జలాలను తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎన్డబ్ల్యూడీఏ కొత్త వాదన తెస్తున్నది. ఆచరణలో అది అంత సులువేమీ కాదని ఇంజినీర్ల అభిప్రాయం. నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడతారు. కాబట్టి, నిర్వహణ మొత్తం కేంద్రం నియంత్రణలో ఉంటుంది. దీంతో ఇచ్చంపల్లి బరాజ్ నుంచి నీటి వినియోగంపై తెలంగాణకు నియంత్రణ ఏమాత్రం ఉండదు. మేడిగడ్డ బరాజ్ ఉండటం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఏ ఆయకట్టుకు, ఎక్కడ నీళ్లు తక్కువ పడినా, ఎప్పుడంటే అప్పుడు ఎత్తిపోసుకునేందుకు ఇప్పుడున్న వెసులుబాటు పూర్తిగా తొలిగిపోతుందని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరడం ప్రశ్నార్థకమేనని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నదుల అనుసంధానం ప్రాజెక్టుతో ఇటు ముంపు విషయంలో, అటు జలాల వినియోగంలోనూ తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నా, ప్రాజెక్టు ద్వారా ఒనగూరే ప్రయోజనాలు మాత్రం నామమాత్రమే. గోదావరి నుంచి కావేరికి తరలించే జలాల్లో ఆవిరి ప్రవాహ నష్టాలు పోగా ఆంధ్రప్రదేశ్కు 44 టీఎంసీలు, తెలంగాణకు 45, తమిళనాడుకు 38, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 16 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. దీనిని బట్టి ముంపుపరంగా అత్యధికంగా నష్టపోతున్న తెలంగాణ ఆ ప్రాజెక్టు ఫలాలను పొందడంలో మాత్రం తీవ్రంగా నష్టపోతుంది. అయినప్పటికీ, బీజేపీ సర్కారు జాతీయ ప్రయోజనాల పేరిట తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నది. తెలంగాణను నిలువునా ముంచే ప్రణాళికలను మొండిగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది.
ఇచ్చంపల్లి దిగువన దుమ్ముగూడెం వరకు గోదావరి జలాలను సైతం తెలంగాణ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడుతుందని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. ఎలాగంటే, ఇచ్చంపల్లి దిగువన దేవాదుల కోసం 38 టీఎంసీలు, సమ్మక్కసాగర్ బరాజ్ నుంచి 47 టీఎంసీలు, ప్రస్తుతం నిర్మిస్తున్న సీతమ్మసాగర్ నుంచి 67 టీఎంసీలు, మోడికుంట నుంచి 1.5 టీఎంసీలు మొత్తంగా 153.5 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు జలాలు ఎగువన ఉన్న ఇచ్చంపల్లి నుంచే దిగువకు రావాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రాజెక్టులో గోదావరి జలాల మళ్లింపునకే తొలి ప్రాధాన్యం ఇస్తే, దిగువన ఉన్న సమ్మక్క బరాజ్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కేంద్ర అనుమతిస్తేనే ఇచ్చంపల్లి నుంచి దిగువకు జలాలు వస్తాయి. దీంతో ఎగువన నీటిని ఎత్తిపోసుకోవాలన్నా, దిగువన వాడుకోవాలన్నా ప్రతి నీటి చుక్కకూ కేంద్రం ఎదుట తెలంగాణ మోకరిల్లాల్సిన దుస్థితి నెలకొంటుందని ఇంజినీర్లు స్పష్టంచేస్తున్నారు.