కామారెడ్డి : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత అన్నారు.
జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కామారెడ్డి కలెక్టరేట్కు చేరుకున్న వారికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలికారు. కేంద్ర బృందం ప్రతినిధులు జనహిత గణేష్ మండలి గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రూర్బన్ పథకం కింద జుక్కల్ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధి పనులపై షార్ట్ ఫిలిం ను చూశారు. రూర్బన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనులు, రైతులకు కలిగిన ప్రయోజనాలను స్థానిక అధికారులు వారికి వివరించారు. మహ్మదాబాద్లో 400 మెట్రిక్ టన్నుల గిడ్డంగి, గోపాలమిత్ర కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.
గోదాం నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నీటి తొట్టిని పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యాబోధన జరుగుతున్న తీరును పరిశీలించారు.
అంగగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం జుక్కల్ లో 30 పడకల దవాఖానను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,డీఆర్డీవో సాయన్న, అధికారులు పాల్గొన్నారు.