హైదరాబాద్ : జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యవిద్యను ప్రోత్సహించడంతోపాటు అంతే స్థాయిలో నర్సింగ్ విద్య సైతం అవసరమని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, మరో తొమ్మిది కాలేజీల పనులు కొనసాగుతుండగా.. దీంతో ప్రస్తుతం మొత్తం 26 కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో రెండు హైదరాబాద్లో ఉండగా, మిగతా ఏడు కామారెడ్డి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి.
ఇవి కాకుండా మిగతా జిల్లాల్లోనూ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటవనున్నాయి. ‘ప్రభుత్వ దవాఖానపై నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరూ పూర్తి ఉచితంగా చికిత్స పొంది, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్లాలి. గ్రామీణ ప్రాంతాలకు కూడా స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కావాలి. మన పిల్లలు వైద్య విద్య చదువుకునేందుకు విదేశాలకు వెళ్లే అగత్యం తప్పాలి. ఇవి సాకారం కావాలంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిందే’ అని సీఎం కేసీఆర్ గతంలో నిర్ణయించారు. రోగులు త్వరగా కోలుకోవడంలో నర్సులది వైద్యులతో సమానమైన పాత్ర. మరోవైపు జాతీయంగా, విదేశాల్లోనూ నర్సులకు ఎంతో డిమాండ్ ఉన్నది. దీంతో తెలంగాణలో తగినంత మంతి సిబ్బందిని అందుబాటులోకి తేవడంతోపాటు తెలంగాణ బిడ్డలకు దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో రెండు దవాఖానలు నిజాం హయాంలోనే ఏర్పాటయ్యాయి. అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ దుస్థితికి చరమగీతం పాడుతూ సీఎం కేసీఆర్ మొదటి విడుతగా మహబూబ్నగర్, నల్గొండ, సిద్ధిపేట, సూర్యాపేటల్లో నాలుగు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఆ తర్వాత రెండో దశలో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, పెద్దపల్లి జిల్లాల్లోని కాలేజీల్లో గతేడాది నవంబర్ 15వ తేదీ నుంచి తరగతులు మొదలయ్యాయి.
దీంతో దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం మొదలైంది. ఒక రాష్ట్రంలో ఒకే ఏడాది 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంత వరకు ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. 2,815 ఎంబీబీఎస్, 1180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది మరో 9 మెడికల్ కాలేజీలను గతేడాది ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు పనులు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ సంవత్సరం ఈ 26 కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసింది.