హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన పోరాటానికి ఎన్నారైలు మద్దతు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు ఆదివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్, ఎన్నారై బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులు తీర్మానించారు. ఓటు వేయడంలో మహిళలకు సమాన హకు కల్పించినప్పుడు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి ఎందుకు రిజర్వేషన్ కల్పించటం లేదని మహిళా ప్రతినిధులు జాహ్నవి దూసరి, సుప్రజ పులుసు, స్నేహ, శైలజ తదితరులు ప్రశ్నించారు. 21వ దశాబ్దంలో కూడా మహిళా హకులు ఇవ్వకపోవడం సరికాదన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు తీసుకురావాల్సిందేనని స్పష్టంచేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో తాము భాగస్వాములమై ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటామని వెల్లడించారు. యూకేలో 32 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యం ఉంటే భారత్లో కేవలం 11 శాతం మంది మహిళలకు మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలపై నిజమైన గౌరవం, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహిళా ప్రతినిధులతో పాటు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి, అరవింద్రెడ్డి, హరిగౌడ్ నవపేట్, అనిల్ బైరెడ్డి, రవి ప్రదీప్ పులుసు, జెల్లా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.