బెంగళూరు సర్వీసులకు వర్తించదు: ఆర్టీసీ
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : రాజధాని సర్వీసు చార్జీకే గరుడ ప్లస్లో ప్రయాణించే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు కల్పించింది. గరుడ ప్లస్ చార్జీలను తగ్గించినట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నడుస్తున్న ఏసీ గరుడ ప్లస్ చార్జీలను రాజధాని టికెట్టుకు సమానంగా సవరించినట్టు అందులో పేర్కొన్నారు. సవరించిన చార్జీలు షెడ్యూల్, ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికుల స్పందనను బట్టి తదుపరి పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. కర్ణాటక ఆర్టీసీతో సమానంగా చార్జీలు అమలులో ఉన్న హైదరాబాద్ – బెంగళూరు ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టంచేశారు .
సజ్జనార్కు పర్యావరణహిత ఆహ్వానపత్రిక
పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా కృషిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి, నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మకరందు (అండర్ ట్రైనింగ్) శుక్రవారం జరుగనున్న తన వివాహానికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విత్తనాలతో తయారు చేసిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఇచ్చి ఆహ్వానించారు. ప్రత్యేకంగా తయారైన ఈ పత్రికను మట్టిలో కప్పి నీరుపోస్తే మొక్క మొలుస్తుందని తెలిపారు.