Long March | సిరిసిల్ల : ప్రముఖ సినీ నవలా రచయిత పెద్దింటి అశోక్కుమార్( Peddinti Ashok Kumar ) రాసిన ‘లాంగ్ మార్చ్’ నవల ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University )లో ఎంఏ తెలుగు( MA Telugu ) విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్లో పాఠ్యాంశంగా ఎంపికైంది. తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా చెప్పుకునే ట్యాంక్ బండ్( Tankbund )పై జరిగిన మిలియన్ మార్చ్( Million March ) సంఘటన రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసింది.
ఈ నేపథ్యంలో జరిగిన కథాంశాన్ని వాస్తవ సంఘటనలతో అప్పటి సమాజాన్ని, ప్రజల భావోద్వేగాలను ఉన్నది ఉన్నట్లుగా రచించిన లాంగ్ మార్చ్ నవల ప్రస్తుతం ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపికైంది. దీంతో తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డయిన ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకోనుంది. ఇప్పటికే పెద్దింటి అశోక్కుమార్ రాసిన పలు కథలు, వివిధ యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. జిగిరి నవల కూడా ఎంఏ విద్యార్థులకు ఓరియంటల్ కాలేజీలో పాఠ్యాంశంగా ఉంది. యూనివర్సిటీకి పాఠ్యాంశంగా ఎంపికైన ఈ లాంగ్ మార్చ్ నవల త్వరలో చలన చిత్రంగా రాబోతుంది. అన్విక్షికి పబ్లిషర్స్ ప్రచురించిన ఈ నవల ఇప్పటికే రెండు ముద్రణలు పొందింది.