హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి బుధవారం విడుదల చేశారు. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా వర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.
రాష్ట్రంలో మొత్తం 1,080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సులభంగా, ఇంట్లో నుంచే మొబైల్ ద్వారా దరఖాస్తు చేసేందుకు ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. కేవలం సెల్ఫీ తీసి, ఫొటోను అప్లోడ్చేస్తే, విద్యార్థి వివరాలు ప్రత్యక్షమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు. ఇంటర్బోర్డు ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. టీ యాప్ ఫొలియో రియల్ టైం ఫేస్ రికగ్నిషన్ ద్వారా విద్యార్థి వివరాలు దోస్త్ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతాయి. ఇదేకాకుండా ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, తల్లిదండ్రుల మొబైల్ నంబర్, మీసేవా కేంద్రాల ద్వారా సైతం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లింబాద్రి వెల్లడించారు.
దోస్త్లో మూడు విడుతల్లో సీట్లు పొంది ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా 16-9-22 నుంచి 22 -9-22 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. 23 -9-22 నుంచి 30-9-22 వరకు కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ను నిర్వహిస్తారు. అక్టోబర్ 1 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్రావు, కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ జీ యాదగిరి, కళాశాల విద్య అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ డీ తిరువెంగళాచారి, టెక్నికల్ కో ఆర్డినేటర్ గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.